Hyderabad Liquor Seized: తెలంగాణలో అక్రమ మద్యం రవాణాపై.. ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే.. భారీ ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) బాటిళ్లు స్వాధీనం అయ్యాయి. మొత్తం నాలుగు వేర్వేరు కేసుల్లో.. రూ.19.65 లక్షల విలువైన 405 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. గోవా, హర్యానా నుంచి అక్రమంగా మద్యం తెచ్చి.. హైదరాబాద్ సహా రంగా రెడ్డి జిల్లాలో విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాలను.. ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్, ఎస్టీఎఫ్ టీమ్లు అడ్డుకున్నాయి.
రంగా రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ దాడులు – 252 బాటిళ్లు స్వాధీనం
పహాడీ షరీఫ్ వద్ద రంగా రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు నిర్వహించగా, విలువైన 252 మద్యం బాటిళ్లు స్వాధీనం అయ్యాయి. ఈ మద్యం మొత్తం గోవా, హర్యానా ప్రాంతాల నుంచి కార్లలో దాచిపెట్టి తెచ్చారని పోలీసులు గుర్తించారు. బాటిళ్ల మార్కెట్ విలువ సుమారు రూ.12.60 లక్షలుగా అంచనా వేశారు. ఈ కేసులో పాల్గొన్న సిబ్బంది.. ఏఈఓస్ జీవన్ కిరణ్, సీఐలు సుబాష్ చందర్, బాటరాజు, ఎస్సైలు అఖిల్, రవికుమార్, వెంకటేష్లు. స్వాధీనం చేసిన మద్యం సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
శంషాబాద్ డీటీఎఫ్ టీమ్ దాడులు – 135 బాటిళ్లు పట్టివేత
శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు కూడా సవ్యంగా తనిఖీలు చేపట్టి.. 135 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.75 లక్షలు. కార్లలో, బ్యాగుల్లో దాచిన మద్యం గోవా, హర్యానా ప్రాంతాల నుంచి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో సీఐ ప్రవీణ్కుమార్, శ్రీకాంత్రెడ్డి, ఎస్సైలు దేవేందర్రావు, రాఘవేందర్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, చేవెళ్ల ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాధీనం చేసిన మద్యం బాటిళ్లను చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో జమ చేశారు.
ఎస్టీఎఫ్ సీ టీమ్ దాడులు – 9 బాటిళ్లు స్వాధీనం
హైదరాబాద్లోని సుబాష్నగర్, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో.. ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు తన బృందంతో కలసి తనిఖీలు జరిపారు. ఈ దాడుల్లో ఎర్ర శశాంక అనే వ్యక్తి వద్ద నుంచి 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేశారు. వీటి విలువ సుమారు రూ.45 వేలుగా అంచనా వేశారు. నిందితుడితో పాటు మద్యం బాటిళ్లను అమీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.
రైల్వే తనిఖీల్లో మరో 9 బాటిళ్లు పట్టివేత
ఎస్టీఎఫ్ డీ10 సీఐ నాగరాజు ఆధ్వర్యంలో.. రైల్వే పోలీసులు రైల్లో తనిఖీలు జరిపి మరో 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేశారు. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఈ బాటిళ్లను.. సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
ఎన్డీపీఎల్ దాడులు కొనసాగుతాయి
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు.. ఈ నెల 30 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ప్రత్యేక దాడులు జరుగుతున్నాయి. రంగా రెడ్డి, శంషాబాద్, సిటీ ఎస్టీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ.. అక్రమ మద్యం రవాణాను అడ్డుకుంటున్నాయి.
సిబ్బందికి అభినందనలు
తాజా ఆపరేషన్లలో రెండుసార్లు వరుసగా విజయవంతంగా.. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసినందుకు రంగా రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ అభినందించారు. అదేవిధంగా డీటీఎఫ్ టీమ్ను శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియలు ప్రశంసించారు.
Also Read: మావోయిస్టుల మరో సంచలన లేఖ.. ఓటమిని ఒప్పుకుంటున్నాం
అక్రమంగా రాష్ట్రానికి మద్యం రవాణా చేసే ముఠాలను అదుపులోకి తెచ్చేందుకు.. ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.19.65 లక్షల విలువైన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. అక్రమ మద్యం రవాణా ప్రయత్నాలు ఏ మాత్రం సహించబోమని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.