SLBC Tunnel: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులు.. తిరిగి ప్రారంభించేందుకు సర్కాక్ అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నీటిపారుదల శాఖ టన్నెల్ వద్ద ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు.
కాగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నది నీటిని ఉపయోగించి ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 500కు పైగా గ్రామాలకు తాగునీరు అందించాలనే ఈ ప్రాజెక్టు, గత పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో నిరాదరణకు గురైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దీనికి కొత్త ఊపు లభించింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో, ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, మొదట్లో రూ.2,800 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించబడింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని.. నల్లమల అడవుల్లో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం కలిగి ఉంది. ఇందులో 35 కిలోమీటర్ల పని పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్లు బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిలిచిపోయాయి. 2017లో ఖర్చు అంచనా 3,000 కోట్లకు పెంచబడినా, పదేళ్లలో కేవలం 500 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, 2020-22 మధ్య కాలంలో 10 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇది ప్రాజెక్టును పూర్తిగా నిరాకరణకు దారితీసిందని, రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలమూరుకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, నల్గొండకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రాజెక్టుకు కొత్త జీవనం వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో పనులు పునఃప్రారంభించారు. మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి చర్యలు తీసుకున్నారు. కానీ, ఫిబ్రవరిలో జరిగిన దుర్ఘటన అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నల్లమల అడవుల్లో భారీ వర్షాల కారణంగా టన్నెల్ శిథిలమై, 2.5 కి.మీ. పొడవైన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) నీరు, బురదలో మునిగిపోయింది. సొరంగంలో పని చేస్తున్న 8 మంది ఇంజనీర్లు, కార్మికులు కూరుకుపోయి మరణించారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతదేహాల రికవరీకి నెలలపాటు వందలాది మంది, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా, ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ దుర్ఘటన తర్వాత పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి.
సీఎం రేవంత్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ప్రాజెక్టు ఖర్చును 4,600 కోట్లకు పెంచి, 2024-25 బడ్జెట్లో 800 కోట్లు కేటాయించారు. గతేడాది 50 కోట్లు నిర్మాణ సంస్థలకు విడుదల చేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ, సీపేజీ నివారణ, బోరింగ్ మెషిన్ రిపేర్లకు సిఫార్సులు చేసింది. గత జులైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
ఇప్పుడు, అధునాతన సాంకేతికతతో పనులు వేగవంతం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ‘వీటీఈఎం ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను హెలికాప్టర్ ద్వారా ప్రారంభిస్తున్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిర్వహించే ఈ సర్వేలో, 24 మీటర్ల వ్యాసం గల అండర్ స్లంగ్ ట్రాన్స్మిటర్ లూప్తో హెలికాప్టర్ను ఎగురవేస్తారు. ఇది భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలు పంపి, సుడిగుండాలను సృష్టించి, ప్రతిబింబాలను రికార్డ్ చేస్తుంది. ఇది సురక్షితమైన తవ్వక పద్ధతిని సూచిస్తుందని నిపుణులు అంచనా. ఈ సర్వే ద్వారా టన్నెల్ బలహీనతలు, నీటి ఆగమనాలను గుర్తించి, పనులు మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.