Kodangal: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అక్షయ పాత్ర ఫౌండేషన్, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గంలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొడంగల్లో అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను కూడా స్వీకరించనుంది.
ఈ కార్యక్రమ వివరాలను చర్చించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పథకం అమలు కోసం కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లి గ్రామంలో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ‘గ్రీన్ ఫీల్డ్ కిచెన్’ నిర్మించనున్నట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు. నవంబర్ 14వ తేదీన తలపెట్టిన ఈ కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ద్వారా వండిన నాణ్యమైన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు వేడివేడిగా సరఫరా చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి రూ. 7 చొప్పున చెల్లిస్తోంది. అయితే, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన భోజనం అందించేందుకు ఒక్కో విద్యార్థిపై సుమారు రూ. 25 వరకు ఖర్చు చేయనుంది. ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఈ భారీ వ్యయాన్ని ఫౌండేషన్ స్వయంగా భరించనుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధుల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: Kavitha: కూలి రైతుగా మారిన కవిత.. చేనులో పత్తి తీసి రైతులతో మాట్లాడి..!
గత ఏడాది డిసెంబర్ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అందించనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థ భారతదేశానికి చెందిన ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ (NGO). 2000 సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభమైంది. “పాఠశాలకు ఏ ఆకలితో ఉన్న విద్యార్థి రాకూడదు” అనే సంకల్పంతో పనిచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నేడు, భారతదేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో, 72 అత్యాధునిక వంటశాలల ద్వారా ప్రతిరోజూ 2 మిలియన్లకు (20 లక్షలకు) పైగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది.