Hyderabad Police:హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు హబీబ్ నగర్ పోలీసులతో కలిసి ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 33.71లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరికి ముంబయి అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉండటం గమనార్హం. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం టోలీచౌకీ అల్కాపూర్ లో ఉంటున్న ముంబయికి చెందిన సలీం ఖురేషీ ఎలియాస్ హమీద్ ఖురేషీ (53)కి అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయి. మాఫియా డాన్ ఛోటా రాజన్ గ్యాంగులో పని చేసిన ఖురేషీ బంగారం స్మగ్లింగ్ తోపాటు భూ వివాదాల్లో సెటిల్ మెంట్లు చేసేవాడు. 2000 సంవత్సరంలో గ్యాంగ్ లీడర్ ఇంటి నుంచే భారీగా బంగారు నగలు, వజ్రాలు దొంగిలించాడు. ఈ క్రమంలో గ్యాంగ్ లీడర్ తనను చంపేస్తాడని భయపడి 2001లో హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ అతనికి తాళ్లగడ్డ నివాసి, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మహ్మద్ గౌస్ పాషా (33), ముంబయికే చెందిన సాబీర్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. చోరీ చేసిన బంగారం, వజ్రాలు అమ్మి ఖురేషీ హైదరాబాద్ లో వ్యాపారాలు చేసి పూర్తిగా నష్టపోయాడు.
దాంతో మహ్మద్ గౌస్ పాషా, సాబీర్ లతో కలిసి దొంగతనాలు మొదలు పెట్టాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 200కు పైగా ఇళ్లల్లో లూటీలు చేశాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో మల్లేపల్లి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖురేషీ, మహ్మద్ గౌస్ పాషా పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 22తులాల బంగారం బిస్కెట్లు, 3,100గ్రాముల వెండి బిస్కెట్లు, సుత్తి దొరికాయి. దాంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు చేసిన నేరాలను వెల్లడించారు. తస్కరించిన నగలను ఇంట్లోనే కరిగించి బిస్కెట్లుగా మార్చి హైదరాబాద్, నాసిక్ మార్కెట్లలో విక్రయిస్తూ వచ్చినట్టు ఖురేషీ వెల్లడించాడు. నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్, హబీబ్ నగర్ సీఐ పురుషోత్తం, ఎస్ఐ విజయానంద్ తోపాటు సిబ్బందిని అదనపు డీసీపీ అభినందించారు.
Also Read: LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా