ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మద్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వంట గ్యాస్కు సంబంధించి అక్కడక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీలు పని చేస్తాయి. గృహ వినియోగదారులతో పాటు అత్యవసర వాణిజ్య విభాగాలకు వంటగ్యాస్ అడ్డంకులు లేకుండా అందేలా చూడటం ఈ కమిటీల ప్రధాన లక్ష్యం.
రాష్ట్ర స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇందులో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్వీనర్గా ఉండగా డీజీపీతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, సమాచార పౌర సంబంధాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చమురు విక్రయ సంస్థల ప్రతినిధులు సైతం ఈ బృందంలో భాగస్వాములుగా ఉంటారు. వీరు ప్రతిరోజూ రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లు, స్టోరేజ్ డిపోల వద్ద నిల్వలను సమీక్షిస్తారు. గ్యాస్ సిలిండర్ల రవాణాలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెంటనే పరిష్కరించి వినియోగదారులకు సకాలంలో డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. జిల్లా పౌరసరఫరాల అధికారి కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో ఎస్పీ లేదా సీపీతో పాటు అదనపు కలెక్టర్, రవాణా శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ పొజిషన్ను వీరు నిత్యం తనిఖీ చేస్తారు. సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్ 6A, 7 కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
పోలీస్ శాఖ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. గ్యాస్ ప్లాంట్లు, స్టోరేజ్ పాయింట్ల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ కోసం డీఎస్పీ ర్యాంక్ అధికారులను నియమిస్తారు. అవసరమైన చోట్ల గ్యాస్ ట్యాంకర్లకు పోలీస్ ఎస్కార్ట్ సౌకర్యం కల్పిస్తారు. ప్రతిరోజూ శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ ఈ కమిటీకి నివేదిక సమర్పిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను అరికట్టేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తుంది. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిఘా పెంచారు.
చమురు సంస్థలు ప్రతిరోజూ తమ వద్ద ఉన్న నిల్వలు, బుకింగ్లు, పెండింగ్లో ఉన్న డెలివరీల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ప్రభుత్వానికి అందజేయాలి. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా కొరత సమస్య తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పారదర్శకమైన పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ వంటగ్యాస్ చేరేలా యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
ALSO READ: Blower Electric Chulha: వావ్, గ్యాస్ స్టవ్లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!