Telangana Police: నేటి సమాజంలో నేర బాధితులకు సత్వర న్యాయం, భరోసా అందించే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ ఒక విప్లవాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే మొదటిసారిగా ‘ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ (FIR)’ నమోదు చేసే చారిత్రాత్మక విధానాన్ని హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ నూతన విధానం అమలుపై బుధవారం బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో బాధితులకు త్వరతగతిన సేవలందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, బాధితులు ఆసుపత్రిలో ఉన్నా సరే, పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే కేసు నమోదు చేస్తారని తెలిపారు.
గతంలో ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉండటం.. అప్పటికే మానసిక ఆందోళనలో ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగించేదని ఆయన గుర్తుచేశారు. ఈ పౌర కేంద్రీకృత విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, పోలీసులే స్వయంగా వారి వద్దకు వెళ్తారని స్పష్టం చేశారు.
ఈ విధానం అమలులో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధిత పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అకారణంగా ఏ ఒక్క బాధితుడైనా పోలీస్ స్టేషన్ కు తిరగాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. బాధితుల గౌరవానికి, గోప్యతకు భంగం కలగకుండా ఈ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. బాధితుల/పౌర కేంద్రీకృత విధానం ప్రకారం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 వివరాలు పంపాలని సూచించారు.
సైబర్ నేర బాధితుల కోసం ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించిన ‘సి-మిత్ర’తో పాటు, ఇప్పుడు ఈ నూతన విధానం కూడా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని సీపీ తెలిపారు.
Read Also: ఫాలోయింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చా? ఇన్ఫ్లుయెన్సర్ నరేందర్ అక్రమాలపై పోలీసుల కొరడా