రాబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయిందని, కేవలం తక్కువ స్థానాలకే పరిమితమయ్యామని మంత్రి గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో లభించిన ఈ భారీ మద్దతును చూస్తుంటే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని.. ఇదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలు అంటే కేవలం సాధారణ ఎన్నికలు కావని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. ‘నిర్లక్ష్యానికి తావు లేదు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం’ అని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని మెజార్టీ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవడమే మన తదుపరి లక్ష్యం కావాలని.. అందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు.
నాయకుల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కన పెట్టి, పార్టీ గెలుపు కోసం ఏకతాటిపైకి రావాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు ప్రజల నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తుకు దిక్సూచిగా మారతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి కాంగ్రెస్ జెండాను మున్సిపాలిటీలపై ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: Jeevan Reddy: అవమానం భరించలేను.. కాంగ్రెస్ సమావేశం నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి