Lucky Draw Scam: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నరేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లక్కీ డ్రా పేరుతో సామాన్యులను మోసం చేస్తున్నాడన్న ఆరోపణలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన నరేందర్పై తాజాగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈసారి సినీ నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్ నరేందర్ పై చర్యలు చేపట్టారు.
లక్కీ డ్రా మోసాలకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నరేందర్ నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో.. అతను ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా సమీపంలో ఉన్న ఒక భవనంలో దాక్కున్నాడని సమాచారం అందడంతో పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో పాటు కరాటే కళ్యాణి కూడా అక్కడికి వెళ్లారు.
పోలీసులు నరేందర్ను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. నరేందర్, అతని సహచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అక్కడే ఉన్న కరాటే కళ్యాణిపై వారు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆమెను అడ్డుకోవడమే కాకుండా.. ఆమె కుమారుడిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిందితులు ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కరాటే కళ్యాణి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఆదిభట్ల పోలీసులు.. నరేందర్తో పాటు అతనికి సహకరించిన వారిపై BNS 74, 75, 79, 115(2), 132, 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నరేందర్ పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నాడు. లక్కీ డ్రా మోసాలతో పాటు, ఈ తాజా దాడి ఘటనపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ను అడ్డుపెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: నాసిక్లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ