Loan Scam: సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సమాజంలో ఒక మంచి గౌరవం, నెలకు చేతినిండా జీతం. కానీ, కొందరికి ఎంత సంపాదించినా ఆశ తీరడం లేదు. ఈజీ మనీ కోసం అలవాటు పడి, పక్కదారి పడుతున్నారు. పగలు సిస్టమ్ ముందు కూర్చుని సాఫ్ట్వేర్ కోడింగ్ రాసే ఓ టెక్కీ.. రాత్రి వేళల్లో సైబర్ నేరగాడిగా అవతారమెత్తాడు. ఆన్లైన్ లోన్ల పేరుతో అమాయకులను ముంచేస్తూ చివరకు పోలీసుల చిక్కాడు.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ.. వలలో పడి!
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ అనే యువకుడు సాధారణంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతనికి ‘తక్కువ వడ్డీకే ఆన్లైన్ లోన్’ అంటూ ఒక ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. అత్యవసరంగా డబ్బులు అవసరముండటంతో, నిజమేనని నమ్మి ప్రవీణ్ ఆ లింక్ను క్లిక్ చేశాడు. అంతే.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు.
ఫీజుల పేరుతో దోపిడీ
లింక్ క్లిక్ చేసిన కొద్దిసేపటికే ప్రవీణ్కు ఒక గుర్తుతెలియని నంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికిన నేరగాళ్లు.. ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ముందస్తు ఈఎంఐ, సర్వీస్ చార్జీలు అంటూ రకరకాల పేర్లతో ప్రవీణ్ నుండి విడతల వారీగా రూ. 17,951 ఆన్లైన్లో గుంజేశారు. ఆ తర్వాత ఎంతకీ లోన్ అమౌంట్ అకౌంట్లో పడకపోవడంతో పాటు, అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రవీణ్ తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
Also Read: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్గా భాగ్యనగరం- రాంచందర్ రావు
రంగంలోకి దిగిన పోలీసులు.. షాకింగ్ నిజాలు!
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఆదిలాబాద్ పోలీసులు టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఈ మోసానికి పాల్పడింది హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన తలారి ఆకాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని తేలింది. ఆకాష్తో పాటు మరో నలుగురు కలిసి గ్యాంగ్గా ఏర్పడి ఈ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. వీరు ఒక్క ప్రవీణ్నే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మందిని ఇదే తరహాలో బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఆకాష్ను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.