RS Praveen Kumar: స్వేచ్ఛ బ్యూరో: సరూర్ నగర్ లో నిర్వహించే యువసంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. న్యాయ స్థానం తీర్పును గౌరవిస్తామన్నారు. సభలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
యువత అంటే కాంగ్రెస్కి ఎందుకింత భయం..?
యువత అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయం? కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిందన్నారు. రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు చదువుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయస్థానం అనుమతి ఇచ్చిందన్నారు. న్యాయస్థానం ముందు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు..
లొల్లులు సృష్టించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. వాలంటీర్స్ ను పెట్టి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువత, ప్రజలు తరలి రావాలని పిలుపు నిచ్చారు. నిరుద్యోగ బిడ్డలకు గొంతుగా ఉండాలనే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమల్ల రాకేష్ , కొత్తపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాం నర్సింహా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: బండి సంజయ్ కాన్వాయ్కు తప్పిన ప్రమాదం!
కాంగ్రెస్ మహిళా, బహుజన వ్యతిరేక పార్టీ
కాంగ్రెస్ మహిళా, బహుజన వ్యతిరేక పార్టీఅని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చింతకుంటలో యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ ను పరామర్శించారు. ఆమెపై వివక్షా పూరిత దాడిని ఖండిస్తున్నామన్నారు. ఎల్ బీ నగర్ లో అత్యధిక మెజార్టీ తో కౌన్సిలర్ గా కూడా గెలిచారని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా అవమానిస్తూ మాట్లాడి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అవమానించి వివక్షా పూరితంగా వ్యవహరించడం దారుణం అన్నారు.
నిందితులకు గన్ మెన్..
ఈశ్వరమ్మ ను అవమానించిన వెంటనే.. శివ చరణ్ రెడ్డికి 1+1 గన్ మెన్ సెక్యూరిటీ ఇచ్చి తిప్పుతున్నారన్నారు. కానీ దాడికి గురైన బాధితురాలు ఈశ్వరమ్మ 80 ఏళ్ల వయస్సులో భయం భయంగా ఇంట్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితురాలికి గన్ మెన్స్ ఇవ్వకుండా..
నిందితులకు గన్ మెన్ లను ఇచ్చారని మండిపడ్డారు. ఈశ్వరమ్మకు గన్ మెన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివ చరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
Also Read: లోకల్ వార్పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!