Cellphone Driving: హైదరాబాద్: మహానగర రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణసంకటంగా మారుతోంది. అయితే డ్రైవింగ్లో ఏమరపాటు వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా నిర్వహించిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 6,046 మందిపై కేసులు నమోదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
టూ వీలర్లదే పైచేయి.. గణాంకాలు షాకింగ్!
ఈ ప్రత్యేక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ డ్రైవింగ్కు పాల్పడుతూ పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో 5,810 మంది బైక్ రైడర్లు ఉండగా, 51 మంది ఆటో డ్రైవర్లు, 185 మంది కార్లు, ఇతర వాహన యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెల్మెట్ పెట్టుకుని లోపల ఫోన్ ఉంచుకోవడం లేదా ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని మరో చేత్తో చాటింగ్ చేయడం వంటి ప్రమాదకర పనులే ఈ కేసులకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.
నేరుగా కోర్టుకే.. జీరో టాలరెన్స్ విధానం!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డెవిస్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొబైల్ డ్రైవింగ్ విషయంలో తాము ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పట్టుబడిన వారిపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మీ ప్రాణం మాత్రమే కాదు.. ఇతరుల భద్రత కూడా ముఖ్యం
మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ దృష్టి రోడ్డుపై నుంచి మళ్లుతుంది. దీనివల్ల అనుకోని పరిస్థితుల్లో బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు లేదా మలుపుల వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదుటివారిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. మీ ఒక్కరి అజాగ్రత్త వల్ల తోటి ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కేవలం వారం రోజులకే పరిమితం కాదని, ప్రజల భద్రత కోసం నిరంతరం కొనసాగుతుందని విభాగం ప్రకటించింది.
పోలీసుల విజ్ఞప్తి: ఒక్క కాల్ మీ ప్రాణం తీయొచ్చు!
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా గుర్తించాలని పోలీసులు కోరుతున్నారు. డ్రైవింగ్ సమయంలో వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ల కంటే మీ ప్రాణం ఎంతో విలువైనదని గుర్తుంచుకోవాలి. అత్యవసరమైతే వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడాలి తప్ప, డ్రైవింగ్ చేస్తూ రిస్క్ తీసుకోవద్దు. నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని, పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం నగర ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది.
Also Read: నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి