AV Ranganath: హైదరాబాద్లో ఆక్రమణల ప్రక్షాళన పేరుతో నిత్యం వార్తల్లో నిలిచే ‘హైడ్రా’, కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ప్రజా క్షేత్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన పనితీరుపై కోర్టు వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు నడుస్తుంటే.. మరోవైపు ఆయనకు మద్దతుగా సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడం విశేషం.
తాజాగా రంగనాథ్ స్థానంలో వేరొకరిని నియమించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. అమీర్పేట్, మధురానగర్ ప్రాంతాల్లో స్థానికులు ధర్నా చేపట్టారు. ‘సేవ్ హైడ్రా.. రంగనాథ్ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. దశాబ్దాలుగా చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన బడా బాబుల పై భయం లేకుండా చర్యలు తీసుకుంటున్న ధైర్యమైన అధికారి ఆయనేనని, అందుకే ఆయనను బదిలీ చేయవద్దని డిమాండ్ చేశారు.
అయితే, న్యాయపరమైన నిబంధనలు, నోటీసుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఆయనపై లేకపోలేదు. రంగనాథ్ను కొనసాగించాలా లేదా అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినప్పటికీ.. ఆక్రమణలపై ఆయన చూపిన కఠిన వైఖరి, పారదర్శకత నగర భవిష్యత్తుకు ఎంతో అవసరమన్నారు. చట్ట పరిధిలోనే ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని మెజారిటీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.
Also Read: CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!