Abhijit Dipke: పౌర హక్కుల వేదిక సిజెపి ఫౌండర్ అభిజిత్ దీప్కే ఆర్థిక వ్యవహారాలు, సంస్థ నిధుల సేకరణపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన కుటుంబానికి చెందిన ఆర్థిక లావాదేవీలతో పాటు సిజెపి సేకరిస్తున్న నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సూరత్కు చెందిన ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తండ్రి ఆదాయం తక్కువ.. విదేశీ విద్య ఎలా?
ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్రావు దీప్కే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ సమయంలో ఆయన నెలవారీ వేతనం సుమారు రూ. 60,000 నుండి రూ. 65,000 వరకు మాత్రమే ఉండేది. అంత పరిమిత ఆదాయం కలిగిన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, అభిజిత్ దీప్కే అమెరికాలో అత్యంత ఖరీదైన ఉన్నత చదువులు ఎలా చదవగలిగారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల మూలాలపై లోతైన దర్యాప్తు జరపాలని తివారీ డిమాండ్ చేశారు.
నిధుల సేకరణపై ఈసీఐకి ఫిర్యాదు
మరోవైపు, సీజేపీ సంస్థ అధికారికంగా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ, ఎన్నికల వేదికగా ఒక రాజకీయ పక్షంలా వ్యవహరిస్తూ నిధులను స్వీకరించడంపై తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘన అని ఎన్నికల సంఘానికి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తింపు లేని సంస్థ రాజకీయ ప్రచారాలు, నిధుల సేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
రూ. 1 కోటి నిధిపై జీఎస్టీ తనిఖీలు
దీనికి తోడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రకటించిన రూ. 1 కోటి న్యాయ సహాయ నిధి అంశంపై కూడా అమిత్ తివారీ మరో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తానికి 18 శాతం జీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయని, దీనిపై పన్ను చెల్లింపుల కోణంలో విచారణ జరపాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ కు లేఖ రాశారు. ఈ అన్ని వ్యవహారాలపై తక్షణమే విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన కోరారు.
Also Read: మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!