Hydra Commissioner: ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయని, జలవనరులపై యుద్ధాలు రాకముందే జాగ్రత్త పడాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath)సూచించారు. నీటి యుద్ధాలకు ఆస్కారం లేకుండా మేల్కొవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. జేఎన్టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో కలిసి ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్-హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన వరల్డ్ వాటర్ డే ఉత్సవాలకు హైడ్రా కమిషనర్ రంగనాధ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర జనాభా అనూహ్యంగా పెరుగుతోందని, 1.60 కోట్లున్న నగర జనాభా 2050 నాటికి దాదాపు 3 కోట్లకు పెరిగే దాటే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఇలా పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిందన్నారు. ఆ దిశగా హైడ్రా వడివడిగా అడుగులేస్తోందని వివరించారు. మొదటి దశగా 6 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టగా, వీటిలో మూడు చెరువుల పనులు పూర్తయి ప్రారంభం కాగా. మిగతా 3 చెరువులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండో దశలో మరో 18 చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టామని ఆయన వివరించారు. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో వర్షాకాలం వరదలు, వేసవి కాలం నీటి ఎద్దడి సర్వ సాధారణంగా మారిందని, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరదలకు చెక్ పెట్టడమే గాక, నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Fuel Filling Tips: ఆ టైమ్ లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!
ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) డేటా ప్రకారం 1975 నుంచి 2023 లోపు నగరంలో 61 శాతం చెరువులు మాయమయ్యాయని, మరో 15 ఏళ్లలో ఉన్నవి కూడా కనుమరుగయ్యే పరిస్థతి ఉందని కూడా హైడ్రా కమిషనర్ రంగనాధ్ హెచ్చరించారు. 1300 చెరువుల్లో 700 చెరువులు మాయం కాగా, ఉన్న చెరువులు 60 శాతం కబ్జాకు గరయ్యాయన్నారు. ఆక్రమణలను తొలగించాలని పేపర్లలో ఉంటుందే తప్పా కార్యం రూపం దాల్చటం లేదని, లిఖితపూర్వక ఆదేశాలకే పరిమతమవుతున్నాయని వ్యాఖ్యానించారు. కాని అవి అమలు కాని పరిస్థితి గతంలో ఉండేదని, మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలోని ఎన్ కన్వెన్షనే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. హైడ్రా వెంటనే ఎన్ కన్వేన్షన్ పై చర్యలు తీసుకుని 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 29 ఎకరాలకు విస్తరించిందన్నారు. ఇదే పరిస్థితి నగరంలోని అన్ని చెరువులదని ఆయన తెలిపారు. ఈ ఆక్రమణలను తొలగించినప్పడు కొంతమంది విమర్శించారు. నేడు వారే అభినందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. వేలాది మంది చెరువుల చెంత సేదదీరుతున్నారన్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు పిక్నిక్ స్పాట్గా మారుతున్నాయన్నారు. హైడ్రా చర్యల వల్ల అందరికీ చెరువుల ఎప్టీఎల్, బఫర్ అంటే తెలిసిందని, ఇప్పడు రియల్టర్లు చెరువుల ఎప్టీఎల్, బఫర్ పరిధిలో ఇళ్లు నిర్మించడంలేదని, ప్రజలు కొనటానికి కూడా ముందుకు రావడంలేదని, ఇది కేవలం హైడ్రా చర్యలతోనే సాధ్యమైందని కమిషనర్ గుర్తు చేశారు.
భవిష్యత్ తరాల అవసరాలమేరకు చెరువులు, నాలాలను పరిరక్షించుకంటూ, పర్యావరణహితమైన నగర సాధనే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. బడాబాబుల ఆక్రమణలు తొలగించి 1350 ఎకరాల ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములను కాపాడామని తెలిపారు. చెరువులను పునరుద్ధరిస్తున్నామని, కబ్జాల పట్ల మౌనంగా ఉంటే మన మనుగడే ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రస్తుతానికి కొంతమందికి ఇబ్బందిగా ఉన్నా, లక్షలాది మంది ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు జేఎన్టీయూ, ఎన్ ఆర్ ఎస్ సీ, సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నాలా ఆక్రమణలు తొలగించి 27 కాలనీలను నీటి మునక నుంచి రక్షించామని, వర్షం పడితే నడుం లోతు నీళ్లు నిలిచే అమీర్ పేట లో నాలాల్లో పూడికలు తీయడంతో వరద ముప్పు తప్పిందన్నారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ప్రొ. జీవీ నరసింహారెడ్డి , జీపీబీఏఏఎస్ ఆర్ ఐ డైరెక్టర్ డా. కె. మృత్యుంజయ రెడ్డి , సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ విభాగం ప్రొఫెసర్లు టి. విజయలక్ష్మి, వి. హిమబిందు మాట్లాడుతూ తాగు నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవశ్యకతను వివరించారు. ఆ దిశగా హైడ్రా చేస్తున్నకృషిని అభినందించారు. కబ్జాలు తొలగించడం, చెరువులను పునరుద్ధరించడం హైడ్రా చేసి చూపిందన్నారు.