Uttam Kumar Reddy: రైతు పండించే చివరి బియ్యపు గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకోసమే బడ్జెట్ లో రూ. 3500 కోట్లను కేటాయించినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల పర్వంలో సభ్యుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి ముమ్మాటికీ సమర్ధనీయమేనన్నారు. ఈ ఎగుమతులతో పౌర సరఫరాల శాఖపై రూ. 13 కోట్ల ఆర్థిక భారం తప్పిందని వివరించారు. ఎగుమతులతో సన్న బియ్యం ధర భారీగా పెరిగిందని, దేశంలోనే తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఫుల్ గా పెరిగిందని వివరించారు. థాయ్ లాండ్, వియత్నాం, కంబోడియా దేశాల బియ్యం బ్రాండ్ల సరసన మన రాష్ట్ర తెలంగాణ బియ్యం నిలిచాయన్నారు. రైతుల ప్రయోజనాల కొరకే తెలంగాణా బియ్యాన్ని ప్రీమియం గ్లోబల్ బ్రాండ్ గా ప్రోత్సాహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రైతు పండించిన బియ్యానికి మెరుగైన ధరను పొందటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి వివరించారు. అసలు బియ్యం ఎగుమతికై సిఫార్సు చేసిందే హరీష్ రావు అని వెల్లడిస్తూ, ఇపుడు బియ్యం ఎగుమతి ఓ స్కామ్ అంటూ, హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇంకా ర సరఫరాల శాఖ వద్ద సుమారు 86 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్లు మంత్రి సభాముఖంగా వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు చేసిన రుణాలపై భారీగా వడ్డీ భారం ఉన్నా, రైతుల ప్రయోజనం కోసం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 72 లక్షల మెట్రిక్ టన్నులని, కేంద్రం పరిమితంగా 54 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు వివరించారు. హౌజ్ కమిటీ వేస్తే హరీశ్ రావు ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల పరిశీలనకే పరిమితం కావల్సి వస్తుందని మంత్రి హరీశ్ రావుపై ధ్వజమెత్తారు.
ఎగుమతులతో తెలంగాణా బియ్యానికి భారీగా డిమాండ్ పెరిగి భారతదేశంలోనే అత్యధికంగా ఒక క్వింటాల్ రూ. 3600 ధర పలికిందని ఆయన వెల్లడించారు. తెలంగాణా రైతుల ప్రయోజనం కోసమే ఇక్కడి బియ్యాన్ని గ్లోబల్ బ్రాండ్ గా ప్రోత్సాహిస్తున్నట్లు, కల్పిస్తున్నామన్నారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణా రాష్ట్రం నుండి 22 వేల 750 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసిన తెలంగాణా ప్రభుత్వం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎగుమతుల కార్యక్రమాన్ని దృష్టి మరల్చెందుకే హరీష్ రావు ఆరోపణలకు పునుకుంటున్నారని, వాస్తవానికి హరీశ్ రావే పౌర సరఫరాల శాఖా కమిషనర్ ను సంప్రదించి బియ్యం ఎగుమతులలో తన అనుచరిడికి అవకాశమివ్వాలని వత్తిడి తెచ్చారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.
నిజాలిలా ఉంటే సభను, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించే విదంగా ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల ఒప్పందంపై ఎలాంటి అపోహలకు ఆస్కారమే లేదని మంత్రి కొట్టి పారేశారు. అంతర్జాతీయ కొనుగోలు దారులతో ఎగుమతుల ప్రక్రియలో తెలంగాణా ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో మాత్రమే సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఆయా దేశాల కొనుగోలు దారులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు హరీష్ రావు లేవనెత్తిన అపోహలకు తావు ఉండనే ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు కావడంతో నిలువ చేయడానికి కొంత మేర ఇబ్బంది కల్గుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.