Hydra: మహానగరంలో నిబంధనలకు విరుద్దంగా వెలిసిన ఆక్రమణలను, అక్రమ కట్టడాలపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపింది. బోరబండలోని 3.20 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (Hydra) కాపాడింది. దూలపల్లి విలేజ్లోని సుమారుకుంట చెరువు ఎఫ్టీ ఎల్ పరిధిలో 11 ఎకరాల్లోని అక్రమ కట్టడాలను తొలగించింది. నాగారం, రామకృష్ణానగర్లో 1365 గజాల శివాలయం భూమిని హైడ్రా కాపాడింది. ఇలా మూడు చోట్ల ఒకే రోజు హైడ్రా మూడు ఆపరేషన్లను చేట్టింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ – గండిమైసమ్మ మండలం దూలపల్లి విలేజ్లోని సుమారుకుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా శుక్రవారం తొలగించింది. దాదాపు 42 ఎకరాల పరిధిలో ఈ చెరువు విస్తరించింది.
శిఖం పట్టా ఉందంటూ ఎఫ్టీ ఎల్ పరిధిలో మట్టి నింపడం, పలు నిర్మాణాలు చేపట్టడం, ప్రహరీలు నిర్మించడం చేయడంతో పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు ఉల్లంఘించి, పలు స్క్రాప్ దుకాణాలు, తాత్కాలిక షెడ్డుల్లో హోటళ్లు, కంటైనర్ల తయారీ షాపులు, వెల్డింగ్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇలా 11 ఎకరాల్లోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది. వర్షాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఈ నిర్మాణాలను తొలగించినట్టు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని శిఖం పట్టా భూముల్లో నీళ్లు లేనప్పుడు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని, నిబంధనలను అతిక్రమించి మట్టి నింపడం, ప్రహరీలు నిర్మించడం, షెడ్డులు వేయడం వంటి పనులు చేయరాదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ మండలం యూసుఫ్ గూడ గ్రామంలోని సర్వే నంబరు 128/1 లోని మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. గతంలో అర్బన్ ల్యాడ్ సీలింగ్ యాక్ట్ కింద భూ యజమానుల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమిలో మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలను హైడ్రా అడ్డుకుంది. యూఎల్సీ ల్యాండ్ ప్రభుత్వం క్లియర్ చేసినట్టు తప్పుడు పత్రాలతో 3600ల గజాల స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నించిన షరీఫ్ ఖాన్ మీద బోరబండ పోలీసు స్టేషన్ హైడ్రా కేసు కూడా పెట్టింది. ఈ భూమితో కలిపి మొత్తం 3.20ఎకరాల భూమిలో ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలతో పాటు ఇక్కడ వెలసిన తాత్కాలిక షెడ్డులను తొలగించిన హైడ్రా ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం, నాగారం రామకృష్ణ నగర్ కాలనీ (హెచ్ఎంటీ లేఔట్)లోని శివాలయానికి చెందిన 1365 గజాలను హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లోని శివాలయం నిర్మించగా, మిగిలిన భూమి ఖాళీగా ఉంది. అయితే అక్కడ కొంత మంది స్థానికులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణానగర్ కాలనీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గుడికి కేటాయించిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు హైడ్రా క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో విచారించి దేవాలయానికి కేటాయించిన భూమిగా నిర్ధారించిన తర్వాతే 1365 గజాల స్థలం దేవాలయానికి చెందినదిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.
Also Read: AP Politics: మాజీ సీఎం జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టం- టీడీపీ సీనియర్ నేత ఉమామహేశ్వరరావు