Hyderabad: హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అతిపెద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. ఏకంగా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ని ఆక్రమించి కట్టేశారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 17 అంతస్తుల రెండు టవర్లు. ఈ నిర్మాణం వెనుక ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ ఎవరిది? తీగలాగితే డొంక అంతా కదులుతోంది.
హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం-హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అతిపెద్ద అక్రమ నిర్మాణం బయటపడింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ను ఆక్రమించి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ భారీ ఎత్తైన భవనాలను నిర్మించింది. హైడ్రా తనదైనశైలిలో గుర్తించింది. నిర్మాణ యోగ్యమైన భూమి లేకున్నా ఏకంగా 17 అంతస్తుల కూడిన రెండు టవర్లను నిర్మించింది.
కలెక్టర్ ఎన్వోసీ, సాగునీటి శాఖ అనుమతి లేకుండానే అనుమతులు జారీ అయ్యాయి. ఆ స్థాయిలో టవర్లు కట్టారంటే ఎవరు ఆ వ్యక్తి. అన్నది తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్డులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 7,640.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు చేపట్టింది. హైడ్రా-సాగునీటి శాఖ అధికారులు సంయుక్త తనిఖీలో 7,355.15 చదరపు మీటర్లు హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్లో ఉన్నట్లు గుర్తించారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు-మిగిలిన 285.74 చదరపు మీటర్లు 30 మీటర్ల బఫర్జోన్లో ఉన్నట్లు నివేదికలో తేలింది. ప్రాజెక్టు స్థలంలో నిర్మాణానికి అనువైన భూమి ఒక్క చదరపు మీటరు లేదని అధికారులు తేల్చారు. అయినప్పటికీ రెండు సెల్లార్లు, స్టిల్ట్, 17 అంతస్తులతో రెండు టవర్లు, క్లబ్ హౌస్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు అప్పటి పాలకులు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఎవరిచ్చారు? అధికారులపై ఏ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి? నిబంధనలను ఎందుకు పక్కనపెట్టారు? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణానికి ఎప్పుడు అనుమతులు ఇచ్చారు? 2018 డిసెంబరు 14న భవన నిర్మాణ అనుమతి ఇచ్చారు.
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్-జన్వాడ ఫామ్ హౌస్కి లింకులేంటి? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020 జనవరి 2న సవరించిన అనుమతులు జారీ చేశారు. కీలక శాఖల అనుమతులు లేకుండానే భారీ ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ రావడం వెనుక అప్పటి మున్సిపల్ శాఖలో ఎవరు చక్రం తిప్పారనేది అసలు ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎఫ్టీఎల్లో ఏ ప్రైవేటు సంస్థకు ఇలాంటి అనుమతులు ఇవ్వలేదు.
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు అసాధారణ రీతిలో అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు జోరందుకున్నాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయనే రాజకీయ విమర్శలు పెరిగాయి. ఈ ప్రాజెక్టుకు తెరవెనుక ఎవరు ఒత్తిడి తెచ్చారు? నిబంధనలను ఎందుకు, ఎవరు పక్కనపెట్టారు? అధికారులను ప్రభావితం చేసిందెవరు?
సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. వీటిలో నిజా నిజాలు తేలాలంటే జన్వాడ భూముల లావాదేవీలు-సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ వంటి అంశాలపై మంత్రిత్వ శాఖ స్థాయి ఆదేశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నాయి. జన్వాడలోని ఫామ్హౌస్ వివాదంలోనూ ప్రదీప్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. కేటీయార్ ఫార్మ్ హౌజ్ గా ఆరోపణలున్న ఆ ఫార్మ్ హౌజ్ తనదేనని గతంలో ఆయన కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో జన్వాడ ఫామ్హౌస్ భూమి-సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల మధ్య ఏదైనా క్విడ్ ప్రో కో జరిగిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.