Oil Palm: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్ పామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై అధిక సబ్సిడీలు అందించి యాంత్రీకరణను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. పంట పూర్తిస్థాయిలో ఎదిగిన తర్వాత అవసరమయ్యే రెండో దశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన లక్ష్యమని తెలిపారు. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా, రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా ఈ పంటకి ప్రోత్సాహాన్ని అందించామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మాత్రమే ఉన్న ఆయిల్ పామ్ సాగు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల ఎకరాలకు విస్తరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కొనసాగితే అది 7 లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశముందని పేర్కొన్నారు.
Also read: KBR Flyovers: టీడీఆర్ ఒప్పందాలు విఫలం.. హెచ్ సిటీ పనుల్లో మరో అడుగు ముందుకు!
ప్రపంచ స్థాయి ఆయిల్ పామ్ సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేలా మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలను నిర్వహిస్తామని ప్రకటించారు. అక్కడి ఆధునిక సాగు విధానాలు, యాంత్రీకరణ, నీటి వినియోగ పద్ధతులను పరిశీలించి తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు సంక్షేమమే కేసీఆర్ జీవిత లక్ష్యమని, పంటల వైవిధ్యీకరణలో తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: మీ అయ్యవల్లే ఈ పరిస్థతి.. కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్..!