Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే ఇన్నోవా కారు కొద్దిసేపటి వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల ‘హిట్ అండ్ రన్’కు పాల్పడి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు సృష్టించిన ఈ బీభత్సం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.
దంపతులపైకి దూసుకెళ్లిన కారు
పాలకుర్తి చౌరస్తా వద్ద మొదట ఈ ప్రమాద పరంపర మొదలైంది. బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య వెంకటలక్ష్మి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా మరింత వేగంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: మీ అయ్యవల్లే ఈ పరిస్థతి.. కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్..!
గూడూరు వద్ద మరో యువకుడి బలి
మొదటి ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అక్కడికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరు వద్ద అదే ఇన్నోవా కారు మరో బైక్ను ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదంలో కిష్టాజిగూడెం గ్రామానికి చెందిన వడ్లకొండ రంజిత్ (30) అనే యువకుడు దుర్మరణం చెందాడు. వరుసగా ఇద్దరి ప్రాణాలు తీసినా డ్రైవర్ కారును ఆపకుండా పారిపోయేందుకే ప్రయత్నించాడు.
డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు
కారు వేగాన్ని, వరుస ప్రమాదాలను గమనించిన గూడూరు శివారు గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి ఇన్నోవా వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు. కారు నడుపుతున్న డ్రైవర్ చీపురు రాహుల్ను పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Also Read: కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్