Hostel Safety: హైదరాబాద్ నగరంలోని హాస్టళ్లలో ఉంటు న్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగుల భద్రతపై హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓ హాస్టల్ భవనం కుప్పకూలి ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అనుకోవడం కంటే, ముందే అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్వాహకులకు గడువు విధించారు.
50 గజాల్లో 7 అంతస్తులా? ఇక కూల్చివేతలే!
చాలా ప్రాంతాల్లో 50 గజాల చిన్న స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా 6, 7 అంతస్తులు నిర్మించి హాస్టళ్లు నడుపుతున్నారు. ఇటువంటి అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై హైడ్రా గురిపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాలను కచ్చితంగా కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అనుమతులు లేని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో హాస్టళ్లు నడిపితే సహించేది లేదని హెచ్చరించారు.
జనవరి 1 నుంచి సేఫ్టీ ఆడిట్
నగరంలోని ప్రతి హాస్టల్లో జనవరి 1వ తేదీ నుంచి అధికారులు భద్రతా తనిఖీలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ., అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్’ ద్వారాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. నిబంధనలు పాటించని హాస్టళ్లను వెంటనే మూసివేయిస్తారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు.
సేఫ్టీ లేకుంటే హాస్టళ్లు ఖాళీ చేయాల్సిందే!*
హాస్టళ్లలో ఉండే వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ప్రతి హాస్టల్ నిర్వాహకుడు ఫైర్ సేఫ్టీ, పక్కా అనుమతులు పొంది తీరాలని ఆదేశించారు. తల్లిదండ్రులు నమ్మకంతో తమ పిల్లలను నగరానికి పంపిస్తుంటే, కొందరు నిర్వాహకులు లాభాపేక్షతో వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని చివరి హెచ్చరిక జారీ చేశారు.
Also Read: సిద్దిపేటకు రండి.. కడుపునిండా అన్నం పెట్టి నా భూములు చూపిస్తా: హరీశ్ రావు ఆఫర్!