Bandi Sanjay: సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు నడుపుతున్న వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. భూక్రమణలపై అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ నాయకులను ఎందుకు ఉసిగొల్పుతున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతిపై చర్యలేవి?
ఆధారాలు నిజంగానే ఉంటే కేసీఆర్ కుటుంబంతో సహా, భూకబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల యజమాని కాదని స్పష్టమవుతోందని, ఆయన గతమంతా అక్రమాలు, అవినీతి, భూదందాలతోనే నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో విఫలమై, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తరహా రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.
డీల్ కోసమే ‘సెట్’ కమిషన్
అసెంబ్లీలో స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ఏర్పాటు చేయడం వెనుక కేసీఆర్తో డీల్ కుదుర్చుకునే కుట్ర దాగి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే బాటలో పయనిస్తూ, పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నాటకాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
భూదోపిడీపై బీజేపీ దండయాత్ర
బీఆర్ఎస్ నాయకులు సాగించిన భూదోపిడీపై త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తామని ప్రకటించారు. ఆక్రమణలకు గురైన భూముల్లో కాషాయ జెండాలు పాతి, వాటిని నిరుపేదలకు పంచుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చాక, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నాయకుల భూదోపిడీ, అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
Also Read: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!