Lake Restoration: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలను పరిరక్షించటంతో ఆశించిన ఫలితాలను సాధిస్తున్న హైడ్రా రామంతాపూర్ లోని మరో చెరువును పునరుద్దరించేందుకు సిద్దమైంది. ఇప్పటి వరకు దాదాపు రూ. లక్షా 10 వేల కోట్ల విలువైన సుమారు రెండున్నర వేల ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా గురువారం నుంచి రామంతాపూర్ చెరువు పునరుద్దరణ పనులను మొదలుపెట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ భూమి పూజలు నిర్వహించి, పునరుద్దరణ పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్దరణతో పరిసర ప్రాంతాల్లో వరదల నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని హైడ్రా భావిస్తుంది. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ గురువారం ప్రారంభించారు. సకల జీవకోటికీ ప్రాణాధారమైన చెరువుల పరిరక్షణతో పాటు పునరుద్ధరణకు పెద్ద పీట వేస్తున్న హైడ్రా మొదటి విడతలో 6 చెరువులను పూర్తి చేసిన విషయం విధితమే.
రెండో విడతగా మరో 14 చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోంది. రెండోవిడతలో భాగమైన రామంతాపూర్ పెద్ద చెరువు ఎప్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా, 16 ఎకరాల వరకూ కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఇందులో 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలున్నట్లు కూడా గుర్తించింది. వీటి జోలికి హైడ్రా వెళ్లలేదని కూడా స్పష్టం చేసింది. మరో 4 ఎకరాల మేర తాత్కాలిక షెడ్డులు, గుడిసెలున్నట్లు గుర్తించింది. వీటిని ఖాళీ చేయించి చెరువు పునరుద్ధరణకు 18 ఎకరాలకు పైగా భూమిని హైడ్రా అందుబాటులోకి తెచ్చింది. ఈ చెరువు పునరుద్దరణకు హైడ్రా దాదాపు రూ.19 కోట్ల వరకు వెచ్చించనుంది. చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో వరదల ముప్పు తగ్గి, భూగర్భ జలాల మట్టం మెరుగుపడేందుకు దోహదపడుతుంది. పరిసర ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడడంలోనూ ఈ చెరువు కీలక పాత్ర పోషించనున్నట్లు హైడ్రా భావిస్తుంది.
Also read: మూసీ ప్రక్షాళన చేస్తా.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా.. సీఎం రేవంత్ పవర్ఫుల్ స్పీచ్!
వర్షాకాలం చెరువు నిండితే గుడిసెలు మునిగిపోయేవి. అక్కడ నివసిస్తున్న వారు ప్రతి ఏటా చాలా అవస్థలు పడుతుండేవారు. చెత్త సేకరణతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారి అవస్థలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యేలా హైడ్రా చర్యలు తీసుకుంది. గుడిసెల్లో నివాసం ఉంటున్న వారితో నేరుగా హైడ్రా చర్చలు కూడా జరిపింది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పింది. దీంతో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెరువు పునరుద్ధరణ, విస్తరణకు సహకరించారు. సుమారు 36 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా హైడ్రా చర్యలు తీసుకుంది. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, నగర భవిష్యత్తును కూడా సురక్షితం చేయడటమేనని రామంతాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్ వ్యాఖ్యానించారు.
Also read: Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!