CM Revanth Reddy: మూసీలో ఉన్న కాలుష్యం కంటే కల్వకుంట్ల వాళ్ల కడుపుల్లో ఎక్కువ కాలుష్యం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాడ్లాడారు. టీపీసీసీ చీఫ్ గా మూడేళ్లు కొట్లాడి లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజా పాలనను సాధించుకున్నామని పేర్కొన్నారు. కబ్జాదారుల కోరలను పీకాలని హైడ్రా ను తీసుకువచ్చామని స్పష్టం చేశారు. హైడ్రాను బూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారి జోలికి హైడ్రా వెళ్లదని రేవంత్ అన్నారు.
హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే వద్దంటున్నారని మండిపడ్డారు. గత పాలకులు హైటెక్ సిటీ , అవుటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ సంస్థలను నిర్మించకపోతే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఏడ్చినా భారత్ ఫ్యూచర్ సిటీని కట్టితీరుతామని సీఎం స్పష్టం చేశారు.
అంతర్జాతీయ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తానని సీఎం రేవంత్ వెల్లడించారు. భవిష్యత్తు తరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించునేలా నిర్మిస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వాళ్ల ఫ్యూచర్ ను ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని వాళ్లు అంతా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో హరీశ్ రావు గెలిచే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో ఫారెస్ట్ ను అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. 60 శాతం పచ్చదనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత దిల్లీ నగరం కాలుష్యంతో అల్లాడుతోందని.. ఆ పరిస్థితి రాకూడదనే విస్తృతంగా మెుక్కలు పెంచుతామని పేర్కొన్నారు.
Also Read: నలుగురిలో ఉన్నా.. దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు కారణం ఇదే!
మరోవైపు మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లాలో పుట్టబోయే బిడ్డలు కాళ్లు వంకరపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు విషంలోనే బతకాలా? అంటూ మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వారిని రేవంత్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని పేర్కొన్నారు. గండి పేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల లో అంతర్జాతీయ స్థాయిలో మూసీని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: ఒరిజినల్ నెంబర్ హైడ్.. డూప్లికేట్ నెంబర్తో రీఛార్జ్.. BSNL క్రేజీ టెక్నాలజీ!