Hydra: కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షిస్తుంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెడుతున్న హైడ్రా.. తాజాగా రూ.1300 కోట్ల విలువైన భూమి రక్షించింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్లో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్వే నంబరు 186, 191తో పాటు 334లలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని.. కాపాడాలని బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. కబ్జాలతో ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురి అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలంటూ హైడ్రాను కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబరు 334లో ఇప్పటికే 4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలు చేసి శాశ్వత నివాసాలు నిర్మించుకున్నట్లు నిర్ధారించుకుంది. నివాసాల జోలికి వెళ్లకుండా.. అక్కడ మిగిలి ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. 13 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. అలాగే హైడ్రా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
Also Read: Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు
పాత బస్తీలో ఏకంగా 7 ఎకరాలను ఓ ప్రబుద్ధుడు కబ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. పోలీసు స్టేషన్ లో కేసులకు భయపడుకుండా.. కోర్టు ఫైన్లు కూడా పట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకులతో లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ప్రహరీ నిర్మించాడు. ఆక్రమణలో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో.. పోలీసు బందోబస్తు మధ్య ఇనుప రేకుల ప్రహరీని తొలగించి.. అక్కడ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. దీంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న పాతబస్తీలో గజం జాగా దొరకని ప్రాంతంలో ఏకంగా 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా శుక్రవారం కాపాడిన 7 ఎకరాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాలను పునరుద్ధరిస్తే బమృక్నుద్దౌలా మాదిరి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు.