బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ కేటీఆర్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు కేటీఆర్ దిమ్మ తిరిగి, మైండ్ బ్లాంక్ అయి మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చాచి కొడితే కేటీఆర్ కుటుంబం ఫామ్ హౌస్కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేటీఆర్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు.
రేవంత్ రెడ్డి దమ్ము ఏమిటో గత ఏడాది కాలంగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని మూడో స్థానానికి పంపినప్పుడే కాంగ్రెస్ సత్తా ఏంటో కేటీఆర్కు అర్థం కావాల్సిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మట్టి కరిపించినా.. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 25 శాతం సీట్లు కూడా సాధించలేకపోయినా కేటీఆర్లో మార్పు రాలేదని మండిపడ్డారు. ‘పిల్లకాకికి ఏం తెలుసు ఉండేల్ దెబ్బ’ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం ఉందని.. రేవంత్ రెడ్డి దమ్ము ఏమిటో ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్న తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.
సీనియర్ నేతలను అవమానిస్తే ఊరుకోం
పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నోరు విప్పని కేటీఆర్, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడి వారసుడిలా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. తండ్రి వయస్సున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలను కించపరిచేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా, కావాలనే రేవంత్ రెడ్డిపై ఈర్ష్య, ద్వేషంతో విషం గక్కుతున్నారని ధ్వజమెత్తారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి
వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ కార్యకర్తల సత్తా మరోసారి నిరూపిస్తామని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఎన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరాకుండా పోతుందని ఆయన హెచ్చరించారు.
ALSO READ: Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు