CM Progress Report: వరుస ఎన్నికల ప్రచారం.. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు.. ఇవీ ఈ వీక్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు… తీసుకున్న నిర్ణయాలు. ఇంతకీ ఈ వారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి? తీసుకున్న నిర్ణయాలేంటి?
02-11-2025 (ఆదివారం) ( సంచలన నిర్ణయం )
తెలంగాణలో మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేసేవారు. కానీ ఇక మీదట 85 శాతం సీట్లు తెలంగాణ వారికే ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తితో మేనేజ్మెంట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని సైతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
03-11-2025 (సోమవారం ) ( విద్యార్థులకు గుడ్న్యూస్ )
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ భోజనం అందించనున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నవంబర్ 14న కొడంగల్లో నిర్మించబోతున్న గ్రీన్ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ను వారు ఆహ్వానించారు. కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించబోతున్నారు.
03-11-2025 (సోమవారం ) ( పనుల పరిశీలన )
SLBC ప్రాజెక్ట్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. SLBC టన్నెల్ వద్ద నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వేను సీఎం ఆయన పర్యవేక్షించారు. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కిలోమీటర్ల మేర నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు.
03-11-2025 (సోమవారం ) ( చిత్తశుద్ధితో ఉన్నాం )
SLBC టన్నెల్ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని.. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయలేదన్నారు.
03-11-2025 (సోమవారం ) ( సీఎం సమీక్ష)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆ రోజున సీఎం ఆదేశాల మేరకు సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
04-11-2025 (మంగళవారం) ( శాఖల కేటాయింపు )
తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్కు శాఖలను కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్తో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శాఖల కేటాయింపు తర్వాత సీఎంను అజారుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
04-11-2025 (మంగళవారం) ( AWS ప్రతినిధులతో భేటీ )
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. ఈ సమావేశానికి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
04-11-2025 (మంగళవారం) ( జర్మనీ కాన్సుల్ బృందంతో భేటీ)
జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. హైదరాబాద్లో జీసీసీని ప్రారంభిస్తున్నట్లు సీఎంకి తెలిపింది. డ్యూయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా రానున్న రెండేళ్లలో సుమారు వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించింది.
04-11-2025 (మంగళవారం) ( సహకారం అందిస్తాం )
పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా మార్చడానికి జర్మనీ సహకారం అవసరమని తనను కలిసిన ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాష బోధించేందుకు టీచర్లను నియమించాలని సీఎం కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ, జర్మనీ భాగస్వామ్యం మరింత బలపడాలన్నారు సీఎం. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్స్ రంగాల్లో జర్మనీ కంపెనీలను పెట్టుబడులు పెట్టమని సీఎం కోరారు. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
05-11-2025 (గురువారం) ( ఎన్నికల ప్రచారంలో సీఎం )
షేక్పేటలో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లింలకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాన్ని వివరించారు. దేశంలో, రాష్ట్రంలో ముస్లింలకు హస్తం పార్టీ ఎప్పటి నుంచో సమున్నత స్థానాన్ని కల్పించిందని గుర్తు చేశారు. తాను మొదటి నుంచి సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తిని అని.. అయితే తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ ఓర్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. సవాళ్లు విసిరన నేతలంతా.. ఆధారాలు చూపిస్తే పారిపోతున్నారంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.
05-11-2025 (గురువారం) ( మేం ఆదుకుంటాం )
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సినిమా కార్మికులు, గిగ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని కీలకమైన హామీలను ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు ప్రత్యేక భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను గెలిపిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సినిమా కార్మికులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రకటించారు. కార్మికుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
06-11-2025 (గురువారం) ( నేతలతో మంతనాలు )
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. డివిజన్ల వారీగా ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై డిస్కస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఆఫీసులో జరిగిన ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
07-11-2025 (శుక్రవారం) సీఎం వార్నింగ్
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఏది పడితే అది చేస్తామంటే ఊరుకోమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పారు ఆయన. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని.. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. సంఘాల పేరుతో పైరవీల కోసం వస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
07-11-2025 (శుక్రవారం) ( చేసిందంతా కాంగ్రెస్ )
2004-2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. గడచిన పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని..తమ అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు ఆయన.
08-11-2025 ( శనివారం ) సీఎంకు ఆశీర్వచనాలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. యాదగిరి గుట్ట ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Story By Vamshi Krishna, Bigtv