Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్- బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంతకీ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ ఎక్కడ? చివరిరోజు ప్రచారానికి వస్తారా? లేకుంటే వీడియో మేసెజ్తో సరిపెడతారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రచారంలో కనిపించని కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం ఐదుగంటలతో ప్రచారం ముగియనుంది. అధికార కాంగ్రెస్-బీజేపీల తరపున స్టార్ క్యాంపెయినర్లు ఇచ్చిన జాబితా ప్రకారం అంతా ప్రచారం చేశారు. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ ఎక్కడ అంటూ ప్రత్యర్థుల నుంచి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్ సిటీకి మకాం మార్చారు మాజీ సీఎం కేసీఆర్. దీంతో కేసీఆర్ ప్రచారంలోకి రావడం ఖాయమని అందరూ భావించారు. గడిచిన రెండువారాలుగా కేసీఆర్ మాట లేకుండా.. కేటీఆర్ ప్రచారం చేపట్టారు. కేసీఆర్ ప్రచారంలోకి దిగే ఆ మజాయే వేరని అంటున్నారు కేడర్. అయినా ఆ పార్టీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు.
బీఆర్ఎస్ కేడర్లో అనుమానాలు
కావాలనే కేసీఆర్ ప్రచారంలోకి రాలేదా? ఒకవేళ ఓడిపోతే పార్టీ పరువు పోతుందని భావించి ఆయన వెనక్కి తగ్గారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గులాబీ బాస్ ప్రచారానికి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన అహం ఒకటైతే.. మరొకటి ఓటమి భయం కారణంగా కేసీఆర్ ప్రచారంలోకి రాలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రచారానికి వెస్తే ఆయనకు సమానంగా పరిగణించినట్లు అవుతుందని భావించి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కనీసం కేసీఆర్ గుర్తించకపోవడం రాజకీయంగా తప్పిదమే అవుతుందని వారి ఆలోచన. ఈ ఎన్నికలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫలితం వస్తే కేసీఆర్కు షాక్ అవుతుందని భావించి దూరంగా ఉన్నారని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఇది కేవలం ఒకవైపు వెర్షన్ మాత్రమే.
ALSO READ: ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక
మరోవైపు ఇంకో వెర్షన్కు వద్దాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. లోక్సభ ఎన్నికల్లో కేవలం రాత్రి వేళ మాత్రమే కేసీఆర్ ప్రచారం చేశారు. అప్పుడు కూడా మునుపటి మాదిరిగా ఆయన నోట నుంచి బలమైన వాయిస్ రాలేదు. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. అప్పటి గుణపాఠం అధినేతను వెంటాడుతోందని అంటున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు.
జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ పార్టీ కేడర్, ఇకపై కేసీఆర్ను ప్రచారంలో చూడకపోవచ్చని అంటున్నారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం కేసీఆర్ వీడియో మేసేజ్లకు పరిమితం కావచ్చని అంటున్నారు. గతంలో శివసేన అధినేత బాల్థాక్రే ఈ విధంగా చేశారని, ఆయన అడుగుజాడలో కేసీఆర్ నడవడం ఖాయమంటున్నారు. ఈ లెక్కన బీఆర్ఎస్లో కేసీఆర్ శకం ముగిసిందనే చెప్పవచ్చు.