Kothmira Pachadi: కొత్తిమీర పచ్చడి అనేది ఆంధ్ర, తెలంగాణ వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన, రుచికరమైన పచ్చడి. కొత్తిమీర సువాసన, పచ్చిమిర్చి ఘాటు, చింతపండు పులుపు కలిపి తయారు చేసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. బ్రేక్ ఫాస్ట్.. ఇడ్లీ, దోశ, వడల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్. ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, సులువైన విధానం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర కట్టలు: 2 కట్టలు
పచ్చిమిర్చి: 10 నుంచి 15
టమాటో: 2
చింతపండు: తగినంత
నూనె: 3 – 4 టేబుల్ స్పూన్లు
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
పోపు కోసం:
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
మినప్పప్పు: 1/2 టీస్పూన్
శనగపప్పు: 1/2 టీస్పూన్
ఎండుమిర్చి: 2 – 3
ఇంగువ: చిటికెడు
కరివేపాకు: 1 రెబ్బ
వెల్లుల్లి రెబ్బలు: 4 – 5
తయారీ విధానం :
ముందుగా కొత్తిమీర కట్టలను బాగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆకులు, లేత కాడలు మాత్రమే ఉపయోగించాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కడిగి మధ్యలోకి చీల్చి పెట్టుకోవాలి. టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మందపాటి గిన్నె లేదా పాన్ తీసుకుని.. అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత.. ముందుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి.. అవి కాస్త రంగు మారే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
అదే నూనెలో.. కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర తరుగు వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి, కొత్తిమీరలోని పచ్చివాసన పోయి, నీరంతా ఇగిరిపోయి, అది పూర్తిగా దగ్గరపడే వరకు వేయించాలి. ఇది సుమారు 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. కొత్తిమీర బాగా వేగిన తర్వాత దానిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు, అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేయాలి. కొద్దిగా పసుపు వేసి.. మూత పెట్టి, టమాటోలు పూర్తిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
టమాటోలు మగ్గిన తర్వాత.. స్టవ్ ఆపి, దాన్ని కూడా పూర్తిగా చల్లబరచాలి. వేరే ప్లేట్లోకి తీసుకున్న వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపును తీసుకుని.. ముందుగా మిక్సీలో లేదా రోట్లో వేసి కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత, వేయించిన కొత్తిమీర తరుగు, టమాటో ముక్కలు కూడా అందులో వేసి, మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. పచ్చడిలో కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర ఆకులు మధ్య మధ్యలో తగులుతుంటే రుచి బాగుంటుంది.
పోపు :
ఒక చిన్న పోపు గిన్నె తీసుకుని… అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి అవి దోరగా వేగే వరకు వేయించాలి. పప్పులు వేగిన తర్వాత ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగు వేసి, వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేయించాలి. ఈ పోపును సిద్ధం చేసుకున్న కొత్తిమీర పచ్చడిలో వేసి బాగా కలిపితే.. కమ్మని కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. ఈ కొత్తిమీర పచ్చడిని వేడి అన్నంలో నెయ్యితో, లేదా ఇడ్లీ, దోశ, ఉప్మా, వడలలో సైడ్ డిష్గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.