America: అమెరికాలో అర్ధరాత్రి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్సులో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడ్ని కాల్చి చంపారు. మృతుడు తెలంగాణలోని మేడ్చల్కు చెందినవాడు. యువకుడి పేరు కుంచా అన్షుల్. వెంటనే పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
అమెరికాలో రాత్రివేళ దారుణం.. పిజ్జా డెలివరీ చేస్తుండగా ఓ వ్యక్తిని కాల్చి చంపారు
అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ హౌసింగ్ సొసైటీలో పిజ్జా బాక్సులను డెలివరీ చేసిన 28 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు భారతీయుడిగా గుర్తించారు. అక్కడి పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు కుంచా అన్షుల్. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందినవాడు.
ఎడ్జ్లీ స్ట్రీట్లో రేమన్ రోసెన్ హోమ్స్ హౌసింగ్ కాంప్లెక్స్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ పూర్తి చేసిన తర్వాత కుంచా తలపై కాల్చి చంపారు. అన్షుల్ తలకు బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావంతో స్పృహ లేకుండా నేలపై పడిపోయాడు.
మృతుడు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నివాసి
ఈ విషయాన్ని ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇన్స్పెక్టర్ స్కాట్ స్మాల్ వెల్లడించారు. వెంటనే పోలీసులు కుంచాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కుంచా పీట్స్ పిజ్జాలో పని చేశాడని నిర్ధారించినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో మృతుడు పడి ఉన్న చోటుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో పోలీసులు మూడు ఖాళీ తూటాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆ సన్నివేశాన్ని గమనించిన పోలీసులు, కాల్పులు జరిపిన వ్యక్తి.. బాధితుడికి చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పారు. ఘటనా స్థలం సమీపంలో బాధితుడి వాహనం ఉంది. ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లో అధికారులు మూడు పిజ్జా పెట్టెలు, ఓ సంచిని కనుగొన్నారు. ఫిలడెల్ఫియా హౌసింగ్ అథారిటీ నిర్వహిస్తున్న నిఘా కెమెరాలు ఈ ఘటనలో కొన్ని భాగాలను చిత్రీకరించాయి.
ALSO READ: నకిరేకల్ మున్సిపాలిటీలో ఘోరం.. ఉదయ సముద్రం కాలువల దయనీయ స్థితి..!
కాల్పులు మాత్రం కెమెరాలో నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ముదురు రంగు దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పిజ్జా డెలివరీ వ్యక్తిని వెంబడించినట్టు అందులో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. పిజ్జా డెలివరీ చేసిన ఫోన్ నంబర్ మా దగ్గర ఉందని తెలిపారు.