Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అమలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.గతంలో కేవలం ఇళ్ల పేరుతో ఓట్లు దండుకుని ప్రజలను వంచించారని, ఆ చేసిన పాపం పండటం వలనే కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారని టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో భాగంగా జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతుండటం ఎంతో శుభపరిణామమని ఆయన తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా పేదవాడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో సంపూర్ణంగా విఫలమయ్యారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.‘అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు?’ అంటూ ప్రజలకు నమ్మించి మోసాలకు పాల్పడ్డారన్నారు. పేదలకు నివాసం కల్పించలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉండిపోయిందని విమర్శించారు.
పైలట్ ప్రాజెక్ట్గా ఇందిరమ్మ టవర్స్
పేదల నివాస ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మిస్తున్నట్లు శాసనమండలికి వివరించారు. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇల్లు దక్కేలా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.ఇక రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.720 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఈ నిధులను త్వరగా మంజూరు చేయాలని, పేదల సొంతింటి కలను సాకారం చేసే ప్రక్రియకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!