Kukatpally: స్వేచ్ఛ బ్యూరో: కేపీహెచ్బీ ప్రాంతంలోని అడ్డగుట్ట ఇందిరానగర్ కు చెందిన భార్యాభర్తలు జనాన్ని నమ్మించి చిట్టీల పేర దాదాపు 20కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరానగర్ వాస్తవ్యులైన సీత, రమణారెడ్డి భార్యాభర్తలు. కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. మొదట్లో సక్రమంగా చెల్లింపులు జరుపుతూ వచ్చి జనం నమ్మకాన్ని సంపాదించుకున్నారు.
కొంతకాలం క్రితం పెద్ద మొత్తాల్లో చిట్టీలు ప్రారంభించి పలువురిని సభ్యులుగా చేర్పించుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 20కోట్ల రూపాయలు సేకరించిన భార్యాభర్తలు ఇటీవల ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు. ఆ తరువాత కోర్టులో దివాలా (ఇన్ సాల్వెన్సీ) పిటిషన్ ను దాఖలు చేసి 48మందికి నోటీసులు పంపించారు. అప్పుడుగాని సభ్యులకు తాము మోసపోయామన్నది తెలియలేదు. ఈ క్రమంలో ఇందిరానగర్ కే చెందిన బక్కా మారుతిరెడ్డి అనే వ్యాపారం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులు తమను మోసం చేసిన సీత, రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన జరిపారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం, పిల్లల చదువుల కోసం, సొంత ఇంటి నిర్మాణాల కోసం చిట్టీలు వేసి డబ్బులు దాచిపెడితే ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరి బాధితులు చాలామంది ఉన్నారని దాదాపు 50 నుంచి 70 కోట్ల మేర డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. తమ డబ్బులు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చారన్నారు. కూతురు పెళ్లి ఘనంగా చేయడంతోపాటు కేజీల కొద్దీ బంగారం, వెండి కట్నంగా ఇచ్చారని బాధితులు చెప్పారు. అంతే కాకుండా స్థలాలను కూడా కొనుగోలు చేశారన్నారు. ఇప్పుడు తమ దగ్గర ఏమీ లేదంటూ ఐపీ పెట్టి పారిపోయారని ఆరోపించారు.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?