IPL Betting: స్వేచ్ఛ బ్యూరో: అరవై రోజులపాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమరం ప్రారంభమయ్యింది. అదే సమయంలో బెట్టింగ్ దందా కూడా మొదలయ్యింది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ అన్న సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈసారి ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి బెట్టింగ్ దందాలో దేశం మొత్తం మీద 10వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బు చేతులు మారనుంది. ఒక్క మన రాష్ట్రంలోనే ఈ మొత్తం వెయ్యి కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. బెట్టింగ్ ఉచ్ఛులో చిక్కి అప్నలపాలై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుండటం…వందల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకోలేక పోతున్నారు. కారణం సమగ్రమైన చట్టాలు లేకపోవటం…ఉన్నవాటిలో లొసులుగే కారణమని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.
మన దేశంలో క్రికెట్ బెట్టింగ్ కొత్తేమీ కాదు. రెండు…మూడు దశాబ్ధాల నుంచి ఈ దందా కొనసాగుతోంది. గతంలో ఆఫ్ లైన్ లో నడిచిన ఈ దందా ప్రస్తుతం ఆన్ లైన్ లోకి విస్తరించింది. ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా బెట్టింగ్ మాఫియా ఇప్పుడు అదుపు చేయలేని స్థాయికి చేరుకుంది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్ లైన్ లోకి ప్రవేశించి ఆక్టోపస్ లా విస్తరించింది. ఈ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ లలో బెట్టింగ్ యాప్ ల ప్రకటనలను వరదలా అప్ లోడ్ చేస్తున్నాయి. క్రికెట్ బజ్, మోస్ట్ బెల్, పరీ మ్యాచ్, 22బెట్స్, మెల్ బెట్, 1ఎక్స్ బెట్ ఇలా ప్రస్తుతం 80కి పైగా బెట్టింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి.
ఓవైపు ఆన్ లైన్ లో బెట్టింగ్ దందా జోరుగా నడుస్తుంటే ఆఫ్ లైన్ లో కూడా ఈ కార్యకలాపాలు జోరుగా నడుస్తున్నాయి. తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో కొంతమంది తమ తమ ఇళ్లతోపాటు అద్దెకు తీసుకున్న ఫ్లాట్లు, ఇండ్లు, ఫార్మ్ హౌస్ లను అడ్డగా చేసుకుని బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగులు స్వీకరిస్తూ ఈ వివరాలను కంప్యూటర్లలో ఫీడ్ చేస్తూ జనం నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వీళ్లు మిల్లీ సెకన్ లో రియల్ టైం డేటా ఫీడ్ ను అప్ డేట్ చేస్తుండటం గమనార్హం.
Also Read: Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?
కొన్నేళ్ల క్రితం వరకు బెట్టింగులు ఆయా మ్యాచ్ ల ఫలితాలపైనే ఉండేవి. ఇప్పుడు బెట్టింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. టాస్ ఎవరు గెలుస్తారు? మొదట బ్యాటింగ్ ఎవరు చేస్తారు? మొట్ట మొదటి బాల్ కు ఫోర్ పోతుందా? సిక్స్ కొడతారా? ఏ ఓవర్ లో ఎన్ని రన్లు వస్తాయి? మ్యాచ్ మొత్తం మీద ఎన్ని నో బాల్స్ పడతాయి? ఎన్ని వైడ్స్ వస్తాయి? ఏ బౌలర్ తన నాలుగు ఓవర్లలో ఎన్ని పరుగులు ఇస్తాడు? ఫలానా బ్యాటర్ హాఫ్ సెంచరీ చేస్తాడా? సెంచరీ చేస్తాడా? చేస్తే..స్ట్రయిక్ రేట్ ఎంత ఉండవచ్చు? ఇలా ప్రతీ దానిపై మాఫియా వంద రూపాయల నుంచి మొదలు పెట్టి లక్షల రూపాయలను బెట్టింగులుగా స్వీకరిస్తోంది.
క్రికెట్ బెట్టింగ్ ఉచ్ఛులో చిక్కి జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును కోల్పోవద్దని ప్రభుత్వాలు…పోలీసు యంత్రాంగం ఎంత చెప్పినా బెట్టింగ్ రాయుళ్లలో మాత్రం మార్పు రావటం లేదు. ఒక అంచనా ప్రకారం గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో 34కోట్లకు పైగా బెట్టింగులు జరిగాయి. ఈ క్రమంలో వేలాది మంది ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్ల మీద పడ్డారు. మరెంతో మంది బలవన్మరణాలకు పాల్పడి తమ తమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చారు.
నిజానికి మన రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ లపై నిషేధం అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో కొన్ని యాప్ లు నడుస్తున్నా వాటిని డౌన్ లోడ్ చేసుకుని డబ్బు కాయటానికి అనుమతి లేదు. అయినా, బెట్టింగ్ దందా నడుస్తూనే ఉంది. ఇలా జనం నుంచి బెట్టింగులు స్వీకరిస్తున్న చాలా యాప్స్ విదేశాల నుంచి నడుస్తున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Also Read: BRS Walkout: కళ్యాణ లక్ష్మి ఫోటోలతో నిరసన.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్!