BRS Walkout: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించినా సహకరిస్తామని చెప్పిన బీఆర్ఎస్ సభ్యులు రోజూ సభకు వస్తున్నారని, అర్థరహితంగా వాకౌట్ చేసి వెళ్లిపోతున్నారంటూ శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం చెప్పటం లేదని, ఇందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు హరీశ్ రావు, ఆ తర్వాత పంచాయతీ రాజ్ పద్దుపై బీఆర్ఎస్ సభ్యురాలు సునీత లక్ష్మా రెడ్డి కూడా తమ ప్రశ్నలకు సమాధానం రాలేదని, కల్యాణ లక్ష్మి స్కీమ్ సక్రమంగా అమలు కావటం లేదని, పెళ్లయి, పిల్లలు పుట్టినా, ఇంకా కల్యాణ లక్ష్మి రాని దరఖాస్తుదారులున్నారని, సభలో ఫొటోలు చూపుతూ, మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రానందుకు నిరసనగా తాము వాకౌ్ చేస్తున్నామని, రెండు సార్లు బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేవారు.
పద్దులపై జరిగిన చర్చ, మంత్రుల సమాధానంలో భాగంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ది లేదన్నారు. అంతకు ముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాకౌట్ లను ఖండిస్తున్నానన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని బీఆర్ఎస్ వరుసగా వాకౌ్ట్లు చేయటం అన్యాయమని, వారికి వాకౌట్ చేసే నైతిక హక్కు కూడా లేదన్నారు. రవాణ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, అవన్నీ వినేందుకు బీఆర్ఎస్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సభలోనే చర్చించాలే తప్పా, మాటిమాటికి వాకౌట్ చేసి వెళ్లిపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఆర్టీసీని నీరుగార్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, 50 రోజులు ఆర్టీసి కార్మికులు ధర్నా చేసినా, ఆర్టీసి కార్మికులు చనిపోయినా కనీసం పట్టించుకోలేదని మంత్రి గుర్తు చేశారు.
బీసీ సంబంధిత సమస్యలు, ఆర్టీసి సమస్యలపై చర్చిస్తున్నపుడు వాకౌట్ చేసి వెళ్లిపోవటం సబబు కాదన్నారు. బీసీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని, రాహూల్ గాందీ ప్రధాని అయిన వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ పద్దుపై సభ్యుల ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం చెబుతూ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ సభ్యులు సభలో మాట్లాడిన ప్రతి సందర్భంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, తాము నిజాలు చెబుతున్న సమయంలో జీర్ణించుకోలేక వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోతున్నారని, బీఏసీ సమావేశంలో మాత్రం నెలరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరిన విషయాన్ని మంత్రి సీతక్క సభా ముఖంగా గుర్తు చేశారు.
Also Read: SADAREM: గుడ్ న్యూస్.. సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్నారా..!