అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో కాకపుట్టిస్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, వాస్తవికతకు దానికి ఎటువంటి సంబంధం లేదని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఆరు గ్యారెంటీల అమలు విజయవంతం ఎక్కడ అయ్యిందని ప్రశ్నించారు.నేటికీ ఆరుగ్యారంటీల అమలు పూర్తిగా కాలేదని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్నాయని,ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్కు ఈ విషయంపై అవగాహన లేనట్టు ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క కౌంటర్లు ఇచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, పెన్షన్ అందజేస్తున్నామని మంత్రులు వివరించారు.త్వరలోనే మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం సైతం అందజేయనున్నట్టు తెలిపారు.ఇదిలాఉండా, కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు పూర్తిగా ఎక్కడా అమలు కావడం లేదని, రైతు భరోసా ఇంతవరకూ ఇవ్వలేదని, పెన్షన్ ఎక్కడ పెంచారని ప్రశ్నించారు. ఇక రవాణా శాఖలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని ప్రవేటీకరణ చేసేందుకు సర్కార్ చూస్తున్నదని ఆరోపించారు.
మంత్రి పొన్నం అందుకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను బస్సు ఓనర్లను చేశామని, తద్వారా వారికి నెల రూ.70వరకు ఆదాయం సంపాదిస్తున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డీజిల్ బస్సుల వలన పర్యావరణ కాలుష్యం జరుగుతున్నదని, అందుకే పర్యావరణ హితమైన ఎలక్ట్రిసిటీ బస్సులను తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలోనే పాత బస్సుల స్థానంలో కొత్త వాటిని తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కొన్ని బస్సులను ఈవీ కింద మోడిఫై చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.
Drugs Case: యువతకు నీతులు.. ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీలు.. మన నేతల అసలు రంగు ఇదేనా?
అందుకు కౌంటర్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు సమాధానం ఇచ్చారు. మూసీ పునరుజ్జీవానికి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా లక్షల కోట్లు కావడం లేదని, కేవలం రూ.7వేల కోట్లతో పునరుజ్జీవం ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రులు పేర్కొన్నారు. దీనిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారని గుర్తుచేశారు.ఇక గాంధీ సరోవర్ వద్ద నిర్మిస్తున్న గాంధీ విగ్రహానికి కేవలం రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు. కాగా,తమ గొంతును సర్కారు నొక్కుతున్నదని బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేయగా.. ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు అసెంబ్లీకి పంపించింది అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజా సమస్యలపై గళం వినిపించాలని మరికొందరు కోరుతున్నారు. ప్రతిసారి ఇలా వాకౌట్ చేయడం వలన విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేయవద్దని.. ప్రజలు, ఉద్యోగులు,ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.