Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చాటినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ 2025-2026 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 3,482 మంది పరీక్షలు రాయగా 2161 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 62.06 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మన జిల్లా 18వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 884 మంది పరీక్షలు రాయగా 612 మంది ఉత్తీర్ణత సాధించి 69.23%తో రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలిచామన్నారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మొత్తం జనరల్ విద్యార్థులు 2994 మంది పరీక్షలు రాయగా, 2186 మంది ఉత్తీర్ణత సాధించి 73.01%తో రాష్ట్రంలో మన జిల్లా 14వ స్థానంలో నిలిచిందన్నారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 706 మంది పరీక్షలు రాయగా 532 మంది ఉత్తీర్ణత సాధించి 75.04%తో మన జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో నిలవడం జరిగిందన్నారు.
Also read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!
గత రెండేళ్లతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు రావడంతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు, డిఐఈఓ హృదయ రాజ్, ఇంటర్ విద్య యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు, అధ్యాపకులు వచ్చే ఏడాది కూడా మంచి ఫలితాలు వచ్చేలా తమ కళాశాలలలో విద్యార్థులకు బోధన చేయాలన్నారు. ప్రణాళికతో ముందుకెళితే 2026-2027 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో మన జోగులాంబ గద్వాల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపవచ్చన్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటర్మీడియట్ అధికారులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Also Read: ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!