Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ట్మాతంగా తీసుకున్నాయి. పోలింగ్ ముగియడంతో అసలు చూపంతా ఈవీఎంపై పడింది. గెలుపుపై సర్వేలు చెప్పినా, గెలుపు మాదంటే మాదేనని పైకి ధీమాగా చెబుతున్నారు నేతలు. ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ రాదని సర్వే సంస్థలు చెప్పాయి. దీంతో బెట్టింగ్ ఊపందుకున్నాయి. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.500 కోట్ల పైగానే బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ బైపోల్ బెట్టింగులు రూ. 500
జూబ్లీహిల్స్ బైపోల్ చెదురుమదురు ఘర్షణలు జరిగినా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారులు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ పోలింగ్ శాతం పెరగలేదు. కేవలం 47 శాతం పైగానే నమోదైంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపు అన్నీ సర్వే సంస్థలు చెప్పాయి. ఓట్ల శాతం పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ-బీఆర్ఎస్కు నాలుగైదు శాతం తేడా వస్తోందని తెలిపాయి.
ఇక బీజేపీ థర్డ్ ప్లేస్కు పరిమితం కానుంది. అందుతున్న అంచనాల మేరకు దాదాపు రూ. 500 కోట్ల బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గెలుపు ఎవరిది? మెజార్టీ ఎంత వస్తుంది? అనేదానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. కూకట్పల్లి కేంద్రంగా బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. పార్టీల కంటే బెట్టింగుల రాయుళ్ల మధ్య ఉత్కంఠ నెలకొంది.
.జాబితా ప్రకారం వసూళ్ల పర్వం మొదలు
బెంగుళూరు నుంచి వచ్చిన కొందరు బెట్టింగురాయుళ్లు పందాలు కాశారని అంటున్నారు. ప్రీ పోల్లో బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉన్నట్లు పలు సంస్థలు తేల్చాయి. పోలింగ్ తర్వాత సీన్ మారిపోయింది.. కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేల్చాయి. పోలింగ్ తర్వాత దాదాపు రెండురోజుల్లో వందలాది కోట్లు బెట్టింగులు కాసినట్టు తెలుస్తోంది.
పోలింగ్ ముగియడంతో ఓటర్ లిస్టు ఆధారంగా ఓటెయ్యని వారిని గుర్తించే పనిలోపడ్డారు రాజకీయ పార్టీల బూత్ స్థాయి నేతలు. డబ్బులు విచ్చలవిడిగా పంచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఇంటికి 30 వేల నుంచి 50 వేల ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లోని కొందరు మాత్రమే ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: పెట్టుబడులే లక్ష్యం.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఎర్రగడ్డ, రహమత్నగర్, యూసుఫ్గూడ వంటి ప్రాంతాల్లో డబ్బులు తీసుకొని ఓటెయ్యని వారిని గుర్తించే పనిలో పడ్డారు దిగువస్థాయి కార్యకర్తలు. ఏజెంట్ వద్ద జాబితా-బూత్ కమిటీ వద్ద జాబితా చూస్తే చాలా డిఫరెన్స్ ఉన్నట్లు సమాచారం. ఒక్కో ఇంట్లో ఐదారు ఓట్లు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే ఓటు వేసినట్టు తెలుస్తోంది.
బుధవారం ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి డబ్బులివ్వాల్సిందేనని ముఖ్యులు సూచించారట. ఓటెయ్యని వారి డబ్బులు వసూలు చేసి, బస్తీలో పనులకు ఉపయోగించాలని బూత్ కమిటీ ఇన్ఛార్జీలకు పైస్థాయి నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. చాలా అపార్ట్మెంట్లలో కూడా ఇలాగే చేశారని అంటున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికల కంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎక్కువ మంది ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.