KTR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నందినగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారని కొనియాడారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ఆయన స్పెషల్ థాంక్స్ చెప్పారు.
ఉప ఎన్నిక ఫలితంపై స్పందిస్తూ.. ఈ ఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అనే విషయం స్పష్టమైందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని చెప్పినప్పటికీ, చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలకు మాగంటి సునీత కొత్త అయినప్పటికీ, అధికార పార్టీకి ఆమె గట్టి పోటీ ఇచ్చారని కేటీఆర్ ప్రశంసించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే, అభ్యర్థి తమ్ముడికే మూడు ఓట్లు ఉన్నాయి’ అని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ పాత్ర గురించి కేటీఆర్ వివరిస్తూ.. ‘ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ సర్కార్ చేసిన మోసాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం’ అని అన్నారు. అయినప్పటికీ, ఏదే ఏమైనా ప్రజా తీర్పును శిరసా వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఫలితం పట్ల పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
చివరగా.. జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆ విషయం ఈ రోజు బిహార్ ఎన్నికల ఫలితాల్లో సుస్పష్టం అవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.