Jupally Krishna Rao: గాంధీ భవన్లో మంత్రులు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాడ్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశాలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ బలహీనతను కేసీఆర్ ఆలస్యంగా గ్రహించారని, పార్టీని కాపాడుకోవడానికే ఆయన మళ్లీ ప్రజల ముందుకు వచ్చారని అన్నారు.
పార్టీ దిగజారడానికి కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ప్రధాన కారణమని.. జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కొడుకు, అల్లుడు వ్యవహార శైలే బీఆర్ఎస్ ప్రజాదారణ తగ్గడానికి కారణమైందని కేసీఆర్కే అర్థమైందని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఇప్పుడు బయటకు వస్తున్నారని అన్నారు. అయితే ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనకు తుది తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు.
పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలను మంత్రి పూర్తిగా ఖండించారు. అది అబద్ధపు ప్రచారమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగునీరు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టులపై స్పష్టమైన దృష్టితో ముందుకు వెళ్తోందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోందన్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని అన్నారు.
కేసీఆర్ పాలనలో మాటలు ఒకలా, పనులు మరోలా జరిగాయని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ముందు చేసే పని వెనక, వెనక చేసే పని ముందు చేసిన వ్యక్తి కేసీఆర్” అని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయమై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేసిన వాదనలు ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఆ ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదని, కేవలం తాగునీటి అవసరాల కోసమేనని కోర్టులో చెప్పారని గుర్తు చేశారు.
నీటి విధానాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు లభించిన నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో చర్చలు, కేంద్రంతో ఒప్పందాల విషయంలో స్పష్టమైన వ్యూహం లేకపోవడం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని విమర్శించారు. నీళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు తెలంగాణకు సమస్యలుగా మారాయని పేర్కొన్నారు.
బీజేపీ ప్రతి అడుగులో బీఆర్ఎస్కు తోడుగా నిలిచిందని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బయటకు విరోధం ఉన్నట్టుగా కనిపించినా, లోపల మాత్రం రెండు పార్టీలు కలిసి పనిచేశాయని అన్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి రాయలసీమను రతనాల సీమగా చేస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన రాజకీయ వ్యవహారంగా ఆయన అభివర్ణించారు.
నీటి హక్కులను సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నట్టుగా నటించడం తప్ప, అప్పట్లో ఆయన చేసిన పనులు తెలంగాణ రైతులకు ఉపయోగపడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన విధానాలతో సాగునీటి, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని చెప్పారు.