Tatikonda Rajaiah: కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాలపై తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కడియం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభ్యత, సంస్కారాల గురించి మాట్లాడే నైతిక అర్హత కడియం శ్రీహరికి అస్సలు లేదని ధ్వజమెత్తారు. పెద్ద నాయకులను విమర్శిస్తే తాను పెద్ద లీడర్ అయిపోతానని కడియం భ్రమపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఒక ‘తెలంగాణ ద్రోహి’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ‘తెలంగాణ ద్రోహి’ అని ఎందుకు అనాల్సి వచ్చిందో రాజయ్య స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, జెండా పట్టలేదని విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా ఆయన నోటి వెంట ‘జై తెలంగాణ’ అనే మాటే రాలేదన్నారు. పైగా తెలంగాణ ఉద్యమకారులపై పిస్తోల్ గురిపెట్టిన చరిత్ర రేవంత్ది అని గుర్తుచేశారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతూ, ఇక్కడి నిధులను ఢిల్లీలో రాహుల్ గాంధీకి కప్పం కడుతున్న రేవంత్ రెడ్డి ద్రోహి కాక మరేమవుతారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నాటిన మొక్కలకు కనీసం నీళ్లు కూడా పోయలేని దద్దమ్మ ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూతురి భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టారు
రేవంత్ రెడ్డి లాగే కడియం శ్రీహరి కూడా ద్రోహిగా మారాడని రాజయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే, తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గ ప్రజలను తాకట్టు పెట్టి కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ భిక్షతోనే కడియం రాజకీయంగా ఎదిగారని.. సొంత ఇల్లు కట్టుకోవడానికి, తనకు, తన కూతురికి ఎన్నికల టికెట్ల కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకుని బతిలాడుకున్న విషయం కడియం మర్చిపోయాడా? అని నిలదీశారు.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు!
తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ తెలంగాణ ఉనికి, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారని రాజయ్య కొనియాడారు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కడియం శ్రీహరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని రాజయ్య తీవ్రంగా హెచ్చరించారు.
Also Read: తలకిందులుగా వేలాడితే ఫ్రీ బైక్.. వైరల్ అవుతున్న షోరూమ్ ఛాలెంజ్!