Oil Palm Cultivation: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతు మహోత్సవాల వేదికగా కాంగ్రెస్ నేత కాకిరాల హరిప్రసాద్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ బృహత్తర నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతును నిజమైన రాజుగా చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రజా పాలనలో ఆయిల్ పామ్ సాగు ఒక విప్లవాత్మక మార్పు అని ఆయన కొనియాడారు.
తాను స్వయంగా 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని.. అందులో ఎనిమిది ఎకరాల్లో ఇప్పటికే పంట చేతికి వస్తోందని హరిప్రసాద్ తన అనుభవాన్ని రైతులతో పంచుకున్నారు. సాధారణంగా ఆయిల్ పామ్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని.. మొదటి మూడు ఏళ్లు ఆదాయం ఉండదని రైతులు భయపడుతుంటారని.. కానీ ఆ భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పంట ద్వారా వచ్చే ఆదాయం రైతు జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుందని.. ఏ ప్రభుత్వం ఇచ్చే పథకాల పైనా ఆధారపడకుండా రైతు తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తుందని వివరించారు.
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని హరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఫ్యాక్టరీ వద్ద ఎలాగైతే రైతు మేళా నిర్వహించారో.. అలాగే ప్రతి గ్రామంలోనూ గ్రామ పంచాయతీల వద్ద దండోరా వేయించి అధికారులతో మీటింగులు పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యేలు.. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు ఈ పంట లాభాల గురించి వివరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. రైతుల్లో ఒకసారి అవేర్నెస్ వస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం రైతు భరోసా వంటి సబ్సిడీలు ఇవ్వకపోయినా.. రైతులే స్వయంగా ప్రభుత్వానికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రైతు దగ్గర డబ్బు ఉంటేనే సమాజంలోని అన్ని వర్గాలు బాగుపడతాయని హరిప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యాపారస్తులు.. విద్యార్థులు.. విద్యాసంస్థలు.. దుకాణదారులు అందరూ రైతు బాగుంటేనే సుభిక్షంగా ఉంటారన్నారు. గతంలో ‘రైతే రాజు’ అనే మాట కేవలం నినాదానికే పరిమితమైందని.. కానీ నేడు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆ నినాదాన్ని నిజం చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. ఈ దిశగా అడుగులు వేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు.