తెలంగాణ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో +2 విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన రాష్ట్ర రాజకీయాలు, పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై విద్యా కమిషన్ అధ్యయనం చేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. జాతీయ స్థాయి ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చే నివేదిక మాత్రమే కాకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా నూతన విధానాన్ని ప్రవేశపెడతామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మేళవింపు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరును ఆయన తప్పుబట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకుని బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతలపై ఘాటుగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన పార్టీ నేతలే బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోందని సీఎం వెల్లడించారు. విచారణ పూర్తి కాకుండా ఎవరిపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ కేసులో తాను కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కే30టీఆర్ లేదా హరీశ్ రావు ఏ తరహా విచారణ కోరినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్న ప్రచారంలో నిజం లేదని పంజాగుట్టలో నమోదైన ఒక ప్రైవేట్ కేసులో మాత్రమే ఊరట లభించిందని వివరించారు.
మూసీ నది ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారిని ఆదుకోవడానికి ప్రజాభిప్రాయాలను సేకరిస్తామన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని.. అయితే ఆ సొమ్మును స్వప్రయోజనాలకు వాడుకోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేసే వారు రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో కూడా లెక్కచూడాలని సూచించారు. గాంధీ మనుమడు కూడా బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..
బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ‘కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే మా లక్ష్యం. తెలంగాణలో పుట్టడం, జీవించడం ఒక వరంగా భావించేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.