KNRUHS: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS)లో మార్కుల గోల్మాల్ ఆరోపణల వ్యవహారంపై బాధితురాలు, పీజీ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థిని హిమజ రియాక్ట్ అయ్యారు. విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణలో తనకు జరిగిన అన్యాయాన్ని.. ఆ తర్వాత న్యాయం జరగడానికి గల కారణాలను వివరిస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు చాలా బాగా రాశానని హిమజ తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు తాను ఫెయిల్ కావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పరీక్షలో మంచి మార్కులు ఆశించిన తనకు ఇలా జరగడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ‘నా ఆన్సర్ షీట్లను ఎవరో కొట్టివేశారు. నన్ను కావాలనే ఫెయిల్ చేయాలని ఎవరో కుట్ర చేశారు’ అని ఆమె ఆరోపించారు.
ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన హిమజ వెంటనే విశ్వవిద్యాలయ వీసీకి ఫిర్యాదు చేశారు. వీసీ ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకుని వెంటనే ఎంక్వైరీ కమిటీ వేశారని.. ఆ కమిటీ విచారణ జరిపిన తర్వాతే తనకు న్యాయం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ‘నాకు అన్యాయం జరిగిన విషయం తెలిసి వీసీ న్యాయం చేశారు. వీసీ ఎంక్వైరీ కమిటీ వేయడంతోనే నాకు న్యాయం జరిగింది’ అని కృతజ్ఞతలు తెలిపారు.
‘నాకు జరిగిన అన్యాయంపై వీసీ జోక్యం చేసుకోకుంటే.. కచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయేదాన్ని.. ఆ పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసుకునేదాన్ని’ అని హిమజ వెల్లడించారు. వీసీ సకాలంలో స్పందించి న్యాయం చేయడం వల్లే తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు న్యాయం జరిగినా.. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.
మార్కుల గోల్మాల్ ఆరోపణల నేపథ్యంలో విశ్వవిద్యాలయ వీసీ రాజీనామా చేశారనే విషయం తెలిసి హిమజ బాధపడ్డారు. తనకు న్యాయం చేసి.. ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలిచిన వీసీ రాజీనామా చేయడం దురదృష్టకరం అని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ALSO READ: Karimnagar News: భార్యని సర్పంచ్ చేద్దామని లేటు వయసులో.. పెళ్లి కట్ చేస్తే..