Kavitha: ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని తీపి, వదురు, చేదు వంటి అన్ని అనుభవాలకు ప్రతీకలని, వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలని తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అందరి జీవితాల్లో వెలుగులు రావాలంటే ‘సర్వోదయ తెలంగాణ’ సాకారం కావాలని ఆకాంక్షించారు. సమాజం కోసం పనిచేసే వారికి నిబద్ధత ఉండాలని.. తెలంగాణ ప్రజలు ఇతరుల కోసం ప్రాణాలైనా ఇచ్చే గొప్ప మనసున్న వారని, అదే నిబద్ధత జాగృతిలో కూడా ప్రతిబింబించాలని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. రేపు జాగృతి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుమారు రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండగా.. జాగృతి తరపున కేవలం రూ. 2.23 లక్షల కోట్లతో కూడిన ‘ప్రజా బడ్జెట్’ను ఆమె ప్రకటించారు. ఈ నిధులను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పలు కీలక కేటాయింపులను సూచించారు.
ప్రజా బడ్జెట్ కేటాయింపులు
ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ వైద్యానికి రూ. 25వేల కోట్లు , విద్యకు రూ. 30వేల కోట్లు, యూనివర్సిటీలకు మరో రూ. 10వేల కోట్లు కేటాయించాలని కోరారు. వ్యవసాయ రంగంలో కౌలు రైతుల కోసం రూ. 35వేల కోట్లు, పేదల ఇళ్ల కోసం రూ. 20వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ. 25వేల కోట్లు ప్రతిపాదించారు. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు రూ. 10వేల కోట్లు, ఉద్యోగ కల్పనకు రూ. 3వేల కోట్లు కేటాయించాలని సూచించారు.
సామాజిక వర్గాల సంక్షేమం
మహిళా సంక్షేమం కోసం రూ. 15వేల కోట్లు, ఆడపిల్లల స్కూటీల కోసం రూ. 5వేల కోట్లు, బీసీలకు రూ. 20వేల కోట్లు, ఎస్సీలకు రూ. 18వేల కోట్లు, ఎస్టీ , ఆదివాసీలకు రూ. 10వేల కోట్లు , బ్రాహ్మణుల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకుతలో రూ. 5వేల కోట్లు, యువతకు రూ. 5వేల కోట్లు , ఆటో డ్రైవర్ల కోసం రూ. 100 కోట్లు కేటాయించాలంటూ సమగ్రమైన ప్రణాళికను వివరించారు.
Also Read:వందేమాతరం పాడకపోతే జైలుకే.. పాతబస్తీ నేతలకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్