Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు.
నిండు శాసనసభలో జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించడం అంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని బండి సంజయ్ మండిపడ్డారు. సభలో గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ.. ఎంఐఎం సభ్యులను ఎవరూ వారించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే గీతాన్ని గౌరవించని వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇదే క్రమంలో స్పీకర్ నిర్ణయాలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ బీ-ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వైఖరి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చట్టసభల పవిత్రతను కాపాడటంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.
‘ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే’ అని స్పష్టం చేస్తూ.. ఒకవేళ తాము అధికారంలో ఉండి ఉంటే ఎంఐఎం నేతల మెడలు వంచి వందేమాతరం పాడించేవాళ్లమని, అప్పటికీ వినకపోతే కటకటాల వెనక్కి నెట్టేవాళ్లమని బండి సంజయ్ హెచ్చరించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి తలొగ్గి, వారి ‘మోచేతి నీళ్లు తాగుతోందని’ ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని పాలకులను నిలదీశారు.
Also Read: నాలుగేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న స్మగ్లర్.. ఎలా చిక్కాడంటే?