Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కవిత నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ అంబేద్కర్ గా అభివర్ణించారు. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక గొప్ప సిద్ధాంతమని, అటువంటి మహనీయుడి జయంతి రోజైనా ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి పేదలకు న్యాయం చేయాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రధాన కారణమని కవిత గుర్తు చేశారు. “రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే శక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్రం బాబా సాహెబ్ పెట్టిన భిక్ష.” అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా దళితులు, మహిళలపై ఆకృత్యాలు తగ్గకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో దళితుల అసైన్డ్ భూములను లాక్కోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వెలుగుమట్ల నుండి పరిగి వరకు దళితుల భూములే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లమల అడవుల్లోని సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని కవిత ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ పరిధిలోని కడిచింతలపైలు, సార్లపల్లి పెంటల్లో నివసిస్తున్న 200కు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించాలని చూడటం సరికాదన్నారు. అడవిని వదిలి వెళ్లేది లేదని చెంచులు మొత్తుకుంటున్నా, పునరావాసం పేరుతో వారిని అడవికి దూరం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఆదివాసీలకు వారి నివాస ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశం ఉన్నా, వారిని వెళ్లగొట్టాలని చూడటం వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
అంబేద్కర్ అంటేనే ధైర్యమని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పేదల పక్షాన తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగిస్తుందని కవిత హెచ్చరించారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దళితుల భూముల రక్షణ కోసం మరిన్ని ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల అభివృద్ధి కోసం బాబా సాహెబ్ కలలు కన్న సోషలిజం నేటి తెలంగాణలో కనిపించకపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకు అండగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.
Read Also: మహిళ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని జగన్ కు చంద్రబాబు లేఖ