Pakistan Hospital HIV Cases: పాకిస్తాన్లోని ఓ ఆసుప్రతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వాడిన సూదులను చిన్నారులకు తిరిగి వాడడంతో.. 331 మందికి హెచ్ఐవీ సోకిందని ఓ నివేదిక బయటకు వచ్చింది. టౌన్సాలో ఉన్న టీహెచ్క్యూ ఆసుపత్రిలో సిబ్బంది పిల్లలకు సిరంజిలను తిరిగి ఉపయోగిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన దర్యాప్తులో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఈ వీడియోలో సిబ్బంది ఉల్లంఘనలు, ఒకే పరికరాన్ని పలువురు రోగులకు తిరిగి వాడటం వంటివి కనిపించాయి. అసురక్షిత వైద్య పద్ధతుల కారణంగా పిల్లలకు హెచ్ఐవీ సోకిందని దర్యాప్తులో రుజువైంది.
ఈ దారుణానికి కేంద్ర బిందువు ఎనిమిదేళ్ల చిన్నారి మహమ్మద్ అమీన్ అని తెలిసింది. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన కొద్దికాలానికే మహమ్మద్ మరణించాడు. తన చివరి రోజుల్లో బాలుడు అధిక జ్వరం, తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడని తల్లి తెలియజేశారు. అతనికి వ్యాధి నిర్ధారణ అయిన కొద్ది రోజులకే, అతని సోదరి అస్మాకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ చికిత్స సమయంలో ఇచ్చిన కలుషితమైన ఇంజెక్షన్ల కారణంగానే తన ఇద్దరు పిల్లలకు వైరస్ సోకిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
2024 స్థానిక వైద్యుడు తన క్లినిక్కు వచ్చే పిల్లలలో హెచ్ఐవీ కేసులు అసాధారణంగా పెరగడాన్ని గమనించడంతో.. ఈ ఘటన మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 2024, అక్టోబర్ 2025 మధ్య టౌన్సాలో 331 మంది పిల్లలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని ఓ దర్యాప్తులో తేలింది. ఈ ఇన్ఫెక్షన్లలో చాలా వరకు కలుషిత ఇంజెక్షన్లతో ముడిపడి ఉండవచ్చని ఆధారాలు చెబుతున్నాయి. 2025 చివరిలో టౌన్సా ఆసుపత్రి లోపల 32 గంటల పాటు ఓ వార్తా సంస్థ రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ లో ఆసుపత్రి సిబ్బంది పరిశుభ్రత నియమాలను ఉల్లఘించినట్లు గుర్తించింది. ఒకరికి వాడిన వైద్య సీసాలు, సిరంజిలను మరొకరికి వాడుతున్నట్లు గుర్తించారు.
ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఒక నర్సు మిగిలిపోయిన లిక్విడ్ ను, వాడిన సిరంజిని తిరిగి వాడుతున్నట్లు బయటపడింది. మూతలు తెరిచి ఉన్న సీసాలు, కౌంటర్టాప్లపై వాడి వదిలేసిన సూదులు, వైద్య వ్యర్థాలను సరిగ్గా డిస్ పోజ్ చేయకపోవడం వల్ల అపరిశుభ్రమైన పరిస్థితులు కనిపించాయి. పలువురు రోగులకు సిరంజిలను తిరిగి ఉపయోగించడం తాము చూసినట్లు తల్లిదండ్రులు కూడా తెలిపారు. ఇలాంటి పద్ధతుల వల్ల ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందుతాయని వైద్యులు అంటున్నారు.
Also Read: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు
ఆసుపత్రి అధికారులు మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ ఖాసిం బుజ్దార్.. బయటకు వచ్చిన వీడియోలు సరైనవి కాదంటున్నారు. కావాలనే తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆసుపత్రి రోగులకు సురక్షితంగా ఉందని, ఇన్ఫెక్షన్ నియంత్రణే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.