IRCTC Jyotirlinga Tour Package: పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ యాత్రలో మూడు జ్యోతిర్లింగాలతో పాటు షిర్డీ సాయిబాబా ఆలయం, శని శింగనాపూర్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. విమాన ప్రయాణంతో కూడిన ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగనుంది.
ఐఆర్సీటీసీ లక్నో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 22, 2026న ప్రారంభమయ్యే యాత్ర అక్టోబర్ 27న ముగుస్తుంది. లక్నో నుంచి నాసిక్ కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి లక్నో చేరుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికులకు వసతి, భోజనం లాంటి సదుపాయాలను ప్యాకేజీలో భాగంగా అందిస్తారు. త్రి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తారు.
ఈ యాత్రలో మహారాష్ట్రలోని ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. నాసిక్ లోని త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు భీమాశంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. నాసిక్ లో పంచవటి, సీతా గుహ లాంటి ప్రాంతాలను కూడా చూసే అవకాశం ఉంటుంది. అనంతరం షిర్డీకి వెళ్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు శని శింగనాపూర్ ఆలయాన్ని కూడా సందర్శించేలా టూర్ షెడ్యూల్ చేశారు.
ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు చారిత్రక ప్రదేశాలను చూడాలనుకునేవారికి కూడా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఛత్రపతి సంభాజీనగర్ పరిధిలోని ఎల్లోరా గుహలను సందర్శించే అవకాశం ఉంటుంది. అదే ప్రాంతంలో ఉన్న ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని కూడా యాత్రలో భాగంగా దర్శించుకోవచ్చు. దీంతో ఒకే ప్రయాణంలో పుణ్యక్షేత్రాలతో పాటు చారిత్రక ప్రదేశాలను చూసే అవకాశం లభిస్తుంది.
ఐఆర్సీటీసీ ప్రకటించిన వివరాల ప్రకారం, స్పెషల్ రూమ్ కావాలనుకునే వారికి ప్యాకేజీ ధర రూ.57,000గా ఉంది. ఇద్దరు కలిసి రూమ్ షేర్ చేసుకుంటూ ఒక్కొక్కరికి రూ.46,400 చెల్లించాలి. ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ.45,400 అవుతుంది. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే వ్యక్తికి రూ.40,800, పిల్లలకు ఒక్కొక్కరికి రూ.38,400గా టారిఫ్ నిర్ణయించారు. ప్యాకేజీ ధరలో విమాన ప్రయాణంతో పాటు వసతి, భోజనం వంటి సదుపాయాలు ఉంటాయి.
ఈ టూర్కు సీట్లు పరిమితంగా ఉండటంతో ముందుగా బుక్ చేసుకున్న వారికే అవకాశం కల్పించున్నారు. లక్నోలోని గోమతి నగర్ పర్యటన్ భవన్ లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
Read Also: కేరెన్స్, క్లావిస్ కు CNG పవర్.. ధరలు ఎంతో తెలుసా?