Karimnagar Congress: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ సభ, మరోవైపు జిల్లా అధ్యక్షుల నియామకంతో గ్రూప్ రాజకీయాలు ఇక చెక్ పడ్డట్లేనని క్యాడర్ భావిస్తుంది. బీఆర్ఎస్ని పట్టించుకునే నాథుడు లేకపోవడం తో పాటుగా బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడూ లేని విధంగా నయా జోష్లో ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖంచుకోటగా మారుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ కార్యకర్తలలో నూతన ఉత్సహాం, ఉత్తేజం కనబడుతుంది.. అసెంబ్లీ ఎన్నికలలో పదమూడు స్థానాలలో తొమ్మిది మంది ఎమ్మెల్యే లుగా గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడడానికి తోర్పాటు అందించింది కరీంనగర్ జిల్లా.. అదేమాదిరి మొదటి విడతలో ఇద్దరూ మంత్రులు, ఇద్దరూ విప్ లుగా కరీంనగర్ జిల్లాకి ప్రాధాన్యతా కూడ ఇచ్చింది అధిష్టానం. విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి రెండవ విడతలో మంత్రి పదవి దక్కగా ఇప్పుడు ముగ్గురు మంత్రులు.. ఒక విప్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇద్దరూ మంత్రులుగా ఉన్న పొన్నం, శ్రీధర్ బాబుల మధ్య సఖ్యత లేకపోగా మొదటి సంవత్సరం కాంగ్రెస్ క్యాడర్ ఎవరి దగ్గరికి పోతే ఎలాంటి తలనొప్పి వస్తుందోనని భయంభయంగానే మంత్రులని కలిసి వచ్చారు.
నామినేటెడ్ పదవులలో శ్రీధర్ బాబుది పై చేయి కావడంతో ఇద్దరూ మంత్రుల మధ్య పొసగడం లేదని టాక్ నడిచింది. పైకి ఇద్దరూ మంత్రులు బాగానే ఉన్న గాని వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నదని టాక్. అయితే మూడవ మంత్రి లక్ష్మణ్ కుమార్ నియామకంలో కూడ శ్రీధర్ బాబు కీలకపాత్ర పోషించడంతో పాటుగా పరిపాలన విషయంలో శ్రీధర్ బాబు తన ఆధిపత్యం కనబర్చడంతో పాటుగా ఎమ్మెల్సీ టికెట్ విషయంలో శ్రీధర్ బాబే కీలకంగా ఉండి మాట నెగ్గడంతో ఒకానొక సమయం పొన్నం ఒకింత గుర్రుగా ఉన్నాడు. అయితే ఆ మధ్య మంత్రి అడ్లూరి విషయంలో మాట జారడంతో తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. తరువాత పొన్నం, అడ్లూరిని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ పిలిచి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇదంతా ఇప్పుడు మరిచిపోయి ముగ్గురు మంత్రులు , విప్ , ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి గ్యాప్ లు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పై ఫోకస్ పెట్టారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నాయకుల మధ్య ఎలాంటి తారతమ్యాలకి అవకాశాలు తానివ్వడం లేదు. ఇటివల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల డీసీసీ అధ్యక్షుల విషయంలో అచితూచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అయా జిల్లాలలో కార్యకర్తకు,సెకండ్ క్యాడర్ అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షుల నియామకం చేబట్టారు. నాలుగు జిల్లాల పరిధిలో నూతన డిసిసి అధ్యక్షులలో ఎక్కడ కూడ అభిప్రాయబేధాలు రాకపోగ అందరూ స్వాగతించారు.
ఇటీవల జరిగిన హుస్నాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు,ఎమ్మెల్యే హాజరు అయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గం పై పెద్ద వరాల జల్లే కుదిర్చారు. ఇప్పుడు ఇదే జోష్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గం లో స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ మొత్తంలో సర్పంచులని గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచులు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే తరువాత జరిగే స్థానిక సంస్థలలో ఎంపిటీసీ స్థానాలు, జడ్పిటీసీ,ఎంపీపీ స్థానాలని కైవసం చేసుకోవచ్చని ఫోకస్ పెంచారు. నూతన అధ్యక్షుల నియామకం, ముఖ్యమంత్రి సభ సక్సెస్, ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్య తో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో నయాజోష్ ఉంది.