Congress: సునీల్ కనుగోలు. రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యేవారికి ఈపేరు సుపరిచితమే. కాంగ్రెస్ పార్టీకి అడ్వైజర్. అప్పట్లో తెలంగాణ పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేసి నానాహంగామా చేశారు. కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసి మీమ్స్ తయారు చేస్తున్నారంటూ అతని ఆఫీసుపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రతిఘటించినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిపోయారు. జస్ట్.. మీమ్స్ చేసినందుకే సునీల్ కార్యాలయంలో పోలీసులు అంతగా ఎందుకు హల్చల్ చేశారో ఇప్పుడు తెలుస్తోంది. సునీల్ కనుగోలు ఎంత ఖతర్నాకో కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో తేలిపోయింది. అందుకే కాబోలు.. సునీల్ పనితనం తెలిసే కాబోలు.. ఆనాడు తెలంగాణ సర్కారు ఆయన ఆఫీసుపై దాడి చేసి, డేటా తీసుకెళ్లి, కేసులు పెట్టి కార్నర్ చేసింది.
కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి, బీజేపీ ఓటమికి అనేక కారణాలు. అధికార పార్టీ బలహీనతలను పక్కాగా పాయింట్ అవుట్ చేసి.. గురి పెట్టి దాడి చేసింది కాంగ్రెస్. అందుకు కావలసిన సరంజామా అంతా సునీల్ కనుగోలు టీమే చేతికి అందించింది. 40 శాతం కమిషన్ సర్కార్.. ఈ నినాదం సునీల్ టీమ్ నుంచే వచ్చింది. అది కర్నాటక ఎన్నికల్లో హోరెత్తింది. బీజేపీని నిండా ముంచింది. ఈ కింద ఉన్న ఇమేజ్ ఓసారి చూడండి.. ఇది చాలదా బీజేపీ ఓట్ బ్యాంక్ను ఫుల్గా డ్యామేజ్ చేయడానికి. ఇలాంటి క్రియేటివ్ వర్క్ అంతా చేసింది సునీల్ టీమే.
పేజీలకు పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి.. పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసే పాత, మూస పద్దతులకు స్వస్థి పలికేలా కాంగ్రెస్ను ఒప్పించడంలో సునీల్ కనుగోలు సక్సెస్ అయ్యారు. సింపుల్గా ఐదు ఆకర్షణీయమైన హామీలతో గ్యారెంటీ కార్డు రిలీజ్ చేయించారు. ఒక్కో హామీ భారీగా ఓట్లు కొల్లగొట్టేలా.. ఏరికోరి ఆ ఐదు హామీలను ఎంపిక చేసింది సునీలే. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువనిధి, శక్తి. ఈ హామీలే ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచేలా చేశాయి. ఆ క్రెడిట్ అంతా సునీల్ కొనుగోలుదే. ఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ సైతం ఇదే మాట అన్నారు. కర్నాటక కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ అంతా సునీల్ కొనుగోలుదేనని.
గతంలో పీకే టీమ్లో కీ పర్సన్గా ఉన్నాడు సునీల్. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్కు అంత క్రేజ్ రావడానికి ఆయన పనితనమే కారణమని అంటారు. ఇప్పుడు సొంతంగా కాంగ్రెస్ కోసం జాతీయ స్థాయిలో పని చేస్తున్నారు. రాష్ట్రాలను బట్టి వ్యూహాలు మారుస్తున్నారు. తెలంగాణలో ఆఫీస్ తెరిచి.. యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో ఆయన స్ట్రాటజీలు హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడిక సునీల్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనే. పోలీసులు తనను టార్గెట్ చేయడంతో.. దెబ్బతిన్న బెబ్బులిలా కనిపిస్తున్నారు. బలంగా ఎదురుదాడి చేసేందుకు తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ పీసీసీ చీఫ్గా ఉండటంతో.. సునీల్ స్ట్రాటజీలకు అదనపు బలం. ఆ ఇద్దరూ కలిసి రంగంలోకి దిగితే.. రానున్న ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందోననే టెన్షన్ కేసీఆర్కు!