Kalvakuntla Kavitha: యాదాద్రి జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళుతున్న కవిత మానవత్వం చాటుకున్నారు. నారాపల్లి వద్ద కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించిన ఓ తండ్రీకుమార్తె.. ద్విచక్రవాహనంపై అదుపుతప్పి రోడ్డుపై కింద పడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన కవిత వెంటనే తన వాహనాన్ని ఆపాలని డ్రైవర్కు సూచించారు. కాన్వాయ్ను నిలిపివేసి స్వయంగా కింద పడిన తండ్రీకుమార్తె వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
వెంటనే కవిత ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్లోని వాహనంలోనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు కూడా వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఆస్పత్రికి చేరుకున్న అనంతరం తండ్రీకుమార్తెకు ప్రథమ చికిత్స అందించారు. వైద్యులు వారిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం స్వల్ప గాయాలే అయినట్లు స్పష్టం చేశారు. కవిత స్వయంగా డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకొని, అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
Also Read: ప్లే స్కూల్ పరిచయం.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరకు భర్త హత్య
రాజకీయ కార్యక్రమాల మధ్యలోనూ ప్రజల భద్రత, సంక్షేమమే తనకు ముఖ్యమని.. కవిత ఈ చర్య ద్వారా స్పష్టంగా చూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట ద్వారా.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా, ఇలాంటి అనుకోని ఘటనల్లోనూ ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించడం కవిత వ్యక్తిత్వాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రీకుమార్తె ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపిన తర్వాత కవిత వారికి ధైర్యం చెప్పి, అవసరమైతే మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.